Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంహిమాచల్‌లో జలవిలయం

హిమాచల్‌లో జలవిలయం

- Advertisement -

63 మంది మృతి..
రూ.400 కోట్ల మేర ఆస్తి నష్టం
సిమ్లా:
హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌కు భారీ ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడింది. బియాస్‌ సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిం చడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండచరియ లు విరిగిపడ్డాయి. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. వరదలు కారణంగా ఇప్పటివరకు 63 మంది మరణించినట్టు సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది. వరదల ధాటికి వంద మందికి పైగా గాయపడ్డారని, పదుల సంఖ్యలో పౌరులు వరదల్లో గల్లంతైనట్టు పేర్కొంది. వారికోసం సహాయక బృందాలు కొనసాగుతోన్నట్టు తెలిపింది. వరదల వల్ల దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
పునరుద్ధరణ చర్యలపై ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు అధికారులు చెప్పారు. జులై 7 వరకు హిమాచల్‌లోని అన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన హెచ్చరికలు చేసినట్టు తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి విలయతాండవం
బిలాస్‌పుర్‌, హమీర్‌పుర్‌, కిన్నౌర్‌, కుల్లు, సిర్మౌర్‌, సిమ్లా, సోలాన్‌, మండీ జిల్లాలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది. హిమాచల్‌ప్రదేశ్‌ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోగా, 14 వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 300కి పైగా పశుసంపద మృత్యువాత పడింది. రాష్ట్రవ్యాప్తంగా 250 రోడ్లు నాశనం అవ్వగా, 500 ట్రాన్స్‌ఫార్మార్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలాది మంది ప్రజలు చీకట్లో గడుపుతున్నారు. ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క మండీ జిల్లాలోనే దాదాపు 17మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఒక్క జిల్లాలోనే 40కిపైగా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -