– 1818 నాటి రికార్డు చెరిపేసిన భారీ వర్షాలు
– స్తంభించిన జనజీవనం
– కేరళలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
– కర్నాటక, తమిళనాడులోనూ ప్రభావం
– దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి
ముంబయి: దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి రోజునే ముంబయిలో సోమవారం భారీ వర్షం దంచికొట్టింది. 107 సంవత్సరాల చరిత్రను చెరిపేస్తూ నగరంలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనుకున్న దాని కంటే 16 రోజుల ముందుగానే రుతుపవనాలు ముంబయిలో ప్రవేశించాయని భారత వాతావరణ కార్యాలయం తెలిపింది. దక్షిణ ముంబయిలోని పలు ప్రాంతాలలో ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం 11 గంటల వరకూ 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. 1918లో నగరంలో నమోదైన 279.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నిన్నటి వరకూ రికార్డు. ఉదయం 8.30 గంటల నుండి 11 గంటల వరకూ కొలాబాలో 105.2 మిల్లీమీటర్లు, శాంటాక్రజ్లో 55 మిల్లీమీటర్లు, బాంద్రాలో 68.5 మిల్లీమీటర్లు, జుహు విమానాశ్రయం వద్ద 63.5 మిల్లీమీటర్లు, చెంబర్ వద్ద 38.5 మిల్లీమీటర్లు, విఖ్రోలీలో 37.5 మిల్లీమీటర్లు, మహాలక్ష్మిలో 33.5 మిల్లీమీటర్లు, సియాన్లో 53.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. ముంబయి నగరంలో మేలో వర్షాలు కురవడం చాలా అరుదు. 75 సంవత్సరాల తర్వాత రుతుపవనాలు తొలిసారిగా ఈ నెలలో ముంబయిని పలకరించాయి. సాధారణంగా జూన్ 11న ముంబయిలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. గత సంవత్సరం జూన్ 6న రుతుపవనాలు నగరంలో ప్రవేశించాయి.
స్తంభించిన జనజీవనం
భారీ వర్షాలతో నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. నగరంలో అనేక చోట్ల రోడ్ల పైకి నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. స్థానిక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను రీ షెడ్యూల్ చేశారు. రాష్ట్రంలో పిడుగులు పడి ఓ వ్యక్తి మరణించగా వరద నీటిలో చిక్కుకున్న 48 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ముంబయి, థానే, రాయగడ్, రత్నగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. పూనే, సతారా, సోలాపూర్, రాయగడ్లో భారీ వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. దాండ్లో 24 గంటల వ్యవధిలో 117 మిల్లీమీటర్ల వర్షం పడింది. బారామతిలో 104.75 మిల్లీమీటర్లు, ఇందాపూర్లో 63.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఒడిషాలోనూ రుతుపవనాల ప్రభావం కన్పిస్తోంది. రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో గత 24 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాగా కర్నాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
పలు ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు
పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు సోమవారం మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, ముంబయి సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, బెంగళూరు సహా కర్నాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, మధ్య పశ్చిమ-ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరంలోని మిగిలిన ప్రాంతాలు, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం తెలిపింది.
కేరళలో…
నైరుతి రుతుపవనాలు ముందస్తు రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) సోమవారానికి రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మూడు జిల్లాలు త్రిస్సూర్, మలప్పురం, కాసర్గోడ్లకు ఆరెంజ్ అలర్ట్ను ఇష్యూ చేసింది. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం విధ్వంసం సృష్టించింది. సోమవారానికి రెడ్ అలర్ట్ జారీ అయిన 11 జిల్లాల్లో పాలక్కడ్ మినహా అన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పరీక్షలు వాయిదా పడ్డాయి. కోజీకోడ్లో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. గత రెండు రోజుల్లో నలుగురు మరణించగా.. 40 ఇండ్లు ధ్వంసమయ్యాయి. వీలాంగర్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో తొమ్మిది కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇడుక్కిలో లోయర్ పెరియార్ డ్యామ్ (పంబ్లాడ్యామ్), మలంకారా డ్యామ్ షట్టర్లను తెరిచారు. పెరియార్, తొడుపూఝా, మువట్టుపుఝా నదుల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్పై ఒక చెట్టు విరిగి పడటంతో త్రిసూర్-గురువాయూర్ రూట్లో రైలు సర్వీసులకు దాదాపు రెండు గంటలు అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి మువట్టుపుళ ఉత్తర ప్రాంతంలో నీటి ప్రవాహంలో వల్లికాడకు చెందిన జాబ్ (42) అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. భారీ వర్షాలకు ఎర్నాకుళంలో ఒక కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కొట్టాయంకు చెందిన ద్విచక్రవాహనదారుడు జేమ్స్కు గాయాలయ్యాయి. కోజికోడ్లో ఎకరూల్-కక్కయం రహదారిపై హిల్ హైవే నిర్మాణంలో ఉండగా.. అక్కడ స్వల్ప కొండచరియలు విరిగిపడ్డాయి.
పాలక్కడ్లోని కురుత్తిచల్లో నది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ముబీన్ మురళీ కోసం గాలింపు చర్యలను పునరుద్ధరించారు. కేరళలోని అనేక ప్రాంతాలలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశమున్నదని తెలిసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
కర్నాటకలో తీర ప్రాంతంపై ప్రభావం
కర్నాటక తీర ప్రాంతాన్ని కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ముఖ్యంగా, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలలో జనజీవనం స్తంభించింది. దీంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. విపత్తు స్పందనా బృందాలను రంగంలోకి దించాయి. తీర కర్నాటకకు జారీ చేసిన రెడ్ అలర్ట్ ఐదు రోజుల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. బెళగావి జిల్లాలో గోడకూలి నిద్రలోనే మూడేండ్ల బాలిక మృతి చెందింది.
తమిళనాడులో 28వరకు భారీ వర్షాలు
తమిళనాడులోనూ రాష్ట్ర ప్రాంతీయ వాతావరణ కేంద్రం నీలగిరి హిల్స్, కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. మే 28 వరకు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరికలు పంపింది. పశ్చిమ కనుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఊటీలో ఒక బాలుడిపై చెట్టుపడటంతో ప్రాణాలు కోల్పోయాడు.
ముంబయిలో కుండపోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES