నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టు సమాచారం ఉందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 2వేల మందిని రక్షించినట్టు చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీజీపీ వివరించారు.
రెండు వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఒకవైపు గణేష్ ఉత్సవాలు ఉన్నప్పటికీ.. వరదలపై పోలీసు శాఖ పోరాటం చేస్తోందని తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తరలించేందుకు డీజీపీ కార్యాలయంలో కూడా అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.