నవతెలంగాణ చర్ల: ఎగువ ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. తాలిపేరుతో పాటు చింత వాగు, పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.
తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద పరవళ్లు తొక్కుతూ ఉండటంతో దిగువ తేగడ వద్ద లో లెవల్ చప్టా నీటమునిగింది. వరద పరిస్థితిని ఏఈ సంపత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రామచంద్రాపురం, బత్తినపల్లి, బట్టి గూడెం తదితర గ్రామాల్లో వాగులు పొంగుతున్నాయి.