– సూర్యాపేట, నల్లగొండ మధ్య ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– డిమాండ్ ఉన్న పంటలే వేయాలి : నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– సమీక్షా సమావేశంలో జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
– ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని, రైతులు పామాయిల్ తోటలు పెంచాలని, సూర్యాపేట, నల్లగొండ మధ్యన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సమావేశ మందిరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మల మాట్లాడుతూ.. వరి పంట వేసి ఇబ్బందులు పడొద్దని, అలాగే ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించాలని, డిమాండ్ ఉన్న పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పంటలు, ధాన్యం సేకరణ, నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాగా పేరుగాంచిందన్నారు. ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈఓలు కావాలని శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఏఈఓలను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్, రెవెన్యూ అధికారులు అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని అన్నారు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి 24 గంటలు అందుబాటులో ఉండి పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. వచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను ప్రత్యేకించి నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. మే 29, 2023 నాటికి రాష్ట్రంలో యాసంగిలో కేవలం 47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటే, ఈ ఏడాది మే 29 నాటికి 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2023లో యాసంగిలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.3,600 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.13250 కోట్లు చెల్లించిందని తెలిపారు. సన్నబియ్యంపై సుమారు 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాజీవ్ యువ వికాసంలో బ్యాంకర్లు లబ్దిదారుల సిబిల్ స్కోర్ను అడగొద్దని అన్నారు.
నల్లగొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాముల అవసరం ఉందని, అందువల్ల మంజూరు చేసిన అదనపు గోదాముల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. కీలక అంశాలపై జరుగుతున్న సమీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పామాయిల్ తోటల పెంపకంపై దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES