డెలివరీ బాయ్స్కు ప్రోత్సాహకాలు పెంపు
గిగ్ వర్కర్ల సమ్మె విజయవంతం
న్యూఢిల్లీ : గిగ్ వర్కర్స్ ఇచ్చిన సమ్మె పిలుపునకు ఫుడ్ యాప్ యాజమాన్యాలు దెబ్బకు దిగివచ్చాయి. డెలివరీ బాయ్స్ డిమాండ్లకు తలొగ్గి పలు ప్రోత్సాహకాలు అందించడానికి ముందుకు వచ్చాయి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ముందు జాగ్రత్తగా వ్యాపారం
నష్టపోతామనే భయంతో ఫుడ్ యాప్లు పలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. ఈ ప్రభావంతో పలు చోట్ల సమ్మె మిశ్రమంగా జరిగింది. ఏడాది చివరి రోజు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఫుడ్ డెలవరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో, జెప్టో తదితర సంస్థలు పలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. డిసెంబర్ 31న సాయంత్రం ఆరు గంటల నుంచి 12 గంటల మధ్య పనిచేసే గిగ్వర్కర్లకు ఒక్కో ఆర్డర్కు రూ.120-రూ.150 చెల్లిస్తామని జొమాటో ప్రకటించింది.
ఆర్డర్లను బట్టి ఒక్కొక్కరు సగటున రూ.3వేలు ఆర్జించవచ్చని పేర్కొంది. అదే విధంగా కాన్సిలేషన్లు, ఆర్డర్లు తీసుకోకపోవడం వంటి వాటిపై జరిమానాలు కూడా విధించబోమని హామీ ఇచ్చింది. జొమాటో తరహాలోనే స్విగ్గీ కూడా తన డెలివరీ బార్సుకు ఆఫర్స్ను ప్రకటించింది. పీక్ అవర్స్లో రూ.2వేల వరకు సంపాదించుకోవచ్చని పేర్కొంది. క్విక్ కామర్స్ వేదిక జెప్టో కూడా ప్రోత్సా హకాలు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 25న గిగ్వర్కర్లు సమ్మె చేపట్టి ఫుడ్ యాప్లకు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో డెలివరీ యాప్స్పై తీవ్ర ప్రభావం పడ్డాయి. కొత్త సంవత్సరం ముందు రోజు భారీగా ఆర్డర్లు ఉండ టంతో మళ్లీ ప్రభావం పడొచ్చనే భయంతో ఆయా యాజమాన్యాలు గిగ్వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంచి తాత్కాలికంగా బయటపడ్డాయని తెలుస్తోంది.



