మరియం హఫీజ్… రెండేండ్ల కిందట కొచ్చిలోని యతీమ్ ఖానా (ముస్లింలు నిర్వహిస్తున్న పిల్లల సంరక్షణ సంస్థ)ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. మధ్యాహ్న సమయంలో బాలికలతో బ్యాడ్మింటన్ ఆడుతూ గడపాలని భావించారు. కానీ 12 ఏండ్ల రుక్సానాతో జరిగిన సంభాషణ ఆమెపై లోతైన ప్రభావాన్ని చూపింది. అదే చివరికి ముస్లిం మహిళల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు ది ఖుష్తార్ ఇనిషియేటివ్ ఏర్పడటానికి దారితీసింది. ఆ వివరాలు నేటి మానవిలో…
మొదట్లో రుక్సాన తన ఒంటరి తల్లికి మద్దతు ఇచ్చేందుకు సొంతంగా పెర్ఫ్యూమ్ కంపెనీ ప్రారంభించాలనే తన కోరికను మరియంతో పంచుకుంది. తర్వాత కాలంలో ఆమె బాధాకరమైన పీరియడ్స్తో పాటు దురదను భరిస్తుందని తెలుసుకున్నారు. రుక్సాన ఎప్పుడూ నీరసంగా కనిపించేది. దీనిపై మరియం కొంచెం లోతుగా ఆలోచించిస్తే రుక్సానా పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లకు బదులుగా వస్త్రాన్ని ఉపయోగిస్తుందని తెలిసింది. ‘నేను ప్యాడ్లు ఎందుకు వాడడం లేదని అడిగితే, ‘ప్యాడ్లు వాడకూడదని నీకు తెలియదా?’ అని నాపై ఎదురుదాడి చేసింది. ఈ విషయం నీకు ఎవరు చెప్పారంటే, ‘అది హదీసు నుండి వచ్చిన నిర్ణయం’ అని చెప్పింది. మరియంకు దాని గురించి తెలియక ఆశ్చర్యపోయింది. సంస్థ అధికారులతో మాట్లాడితే చెత్తను సేకరించే వ్యక్తులు ఋతు వ్యర్థాలను పట్టుకునేందుకు ఇష్టపడరని మరియం తెలుసుకున్నారు. అందుకే బాలికలను ప్యాడ్లకు బదులుగా వస్త్రాన్ని ఉపయోగించమని చెప్పారు. దీని వల్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన తీవ్రమైన సమస్య అని మరియం గ్రహించారు. అంతేకాదు దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కూడా అవసరమని గుర్తించారు.
సవాళ్లను గుర్తించడం
సింగపూర్లోని ఎన్టీయూ నుండి మార్కెటింగ్లో బీబీఏలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మరియం బెంగళూరులోని మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ సంస్థ డెంట్సులో బ్రాండింగ్ విశ్లేషకురాలిగా మూడేండ్లు పని చేశారు. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణలోకి అడుగుపెట్టారు. ఆమె కుటుంబం కేరళలో సన్రైజ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ను నడుపుతోంది. మరియం ఆ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రంగంలో అనుభవం లేకపోయినా ఆరోగ్యం, విశ్వాసం, సంస్కృతిపై ఆసక్తి ఉంది. అంతేకాదు రుక్సానా వంటి చిన్నారుల జీవితాలను మార్చడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే యతీమ్ ఖానా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను తయారు చేసి భారతీయ ముస్లిం మహిళల కోసం ప్రొఫెషనల్ లీడర్షిప్ ఇంక్యుబేటర్ అయిన లెడ్ బై ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రుహా షాదాబ్కు పంపించారు. మరియంను ఆమె దీనిపై ఒక వ్యాసం రాయమని కోరారు.
అట్టడుగు స్థాయి నుండి
‘గణాంకాలను పరిశీలిస్తున్నప్పుడు ఇతర మహిళలతో పోలిస్తే భారతీయ ముస్లిం మహిళలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన లేదని అర్థమయింది’ అని మరియం వివరించారు. దీనికి ప్రధాన కారణాలు పేదరికం, సంప్రదాయం. ఋతు ఆరోగ్యం విషయానికి వస్తే పితృస్వామ్య నిబంధనలు కూడా అడ్డంకిగా ఉన్నాయి. ఖుష్తార్ ఇనిషియేటివ్ ముస్లిం మహిళలకు ఆరోగ్య సంరక్షణ సవాళ్ల గురించి అధ్యయనం చేస్తోంది. ‘మా పని అట్టడుగు స్థాయి నుండి విద్యా, పాత్రికేయ పరిశోధన వరకు ఉంటుంది. ప్రజలకు ఈ విషయాల గురించి తెలియకపోతే అది ఒక సమస్య అని వారు అర్థం చేసుకోలేరు’ అంటూ మరియం వివరించారు. ఖుష్తార్ ఇనిషియేటివ్ (టీకేఐ) కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్లలో ఉంది. ప్రస్తుతం మూడు క్రియాశీల ప్రాజెక్టులను అది నిర్వహిస్తుంది.
సమగ్ర ఆరోగ్య సంరక్షణ
మరియం ప్రారంభించిన సంస్థ గర్ల్స్ ఇన్స్పైరింగ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఐఎస్టీ), ముస్లిం పిల్లల సంరక్షణ సంస్థలతో పాటు స్వతంత్ర సంఘాలతో కలిసి పనిచేస్తుంది. ‘నేను బాలికలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. ప్రతి వర్క్షాప్ తర్వాత కనీసం 10 మంది బాలికలు తమ అక్కచెల్లెళ్లు, తల్లుల కోసం కూడా అడిగిమరీ ప్యాడ్స్ తీసుకెళ్లేవారు. ఈ బాలికలు, మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే, వారు ఎన్నో ఆరోగ్య సంరక్షణ ఉద్యమాలను సృష్టించగలరని నాకు అర్థమైంది’ అని మరియం పంచుకున్నారు. కొచ్చిలోని ఉమ్ముల్ ఖురా అనాథాశ్రమంలో ప్రాథమిక ఆరోగ్య అవగాహనతో పాటు మరెన్నో సమస్యలపై పని చేయడం ప్రారంభించాకరు. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమ్మాయిలకు జీవిత నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేశారు. ఇందులో భాగంగా వారికి ఫుట్బాల్ పరిచయం చేశారు. ఈ క్రీడలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కేరళకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణి సివి షీనా దీని బాధ్యతలు చూశారు. అలాగే వివిధ రంగాలలో విజయాలు సాధించిన ముస్లిం మహిళలను ప్యానెల్ చర్చల కోసం తీసుకువస్తోంది. కళాశాలలు, పాఠశాలల అమ్మాయిల వద్ద వీరితో చర్చలు జరుపుతారు. ఉమ్ముల్ ఖురాలో, టీకేఐ కలిసి ప్రస్తుతం 150 మంది బాలికలతో కలిసి పనిచేస్తుంది. దీని ప్రభావం 64,230 మంది లబ్ధిదారులను చేరుకుంటుందని అంచనా.
మార్పుకు నాయకత్వం
సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధమైన ఫెలోషిప్ కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ సభ్యులను ఆరోగ్య సంరక్షణ నాయకులుగా శిక్షణ ఇస్తున్నారు. కేరళలోని మలప్పురంలోని ఒక ఆశ్రయంలో నివసిస్తున్న హిసానా మాట్లాడుతూ ‘నేను సమాజంలో సానుకూల మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళలు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. నా చెల్లెలు నా నుండి ప్రేరణ పొందాలని నేను కోరుకుంటున్నాను’ అని చెప్పింది. సంస్థకు కావల్సిన నిధుల కోసం కేరళలోని ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామిక వ్యక్తులపై ఆధారపడుతోంది. ‘2030 నాటికి మేము దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో నాలుగు లక్షల మంది లబ్ధిదారులను చేరుకోవాలనుకుంటున్నాం. ఆ రాష్ట్రాలలోని ముస్లిం జనాభా నిష్పత్తి ఆధారంగా మేము ఈ రాష్ట్రాలను గుర్తించాము’ అని మరియం చెప్పారు.
ఆమె ఆరోగ్యం కోసం
- Advertisement -
- Advertisement -