Monday, June 9, 2025
E-PAPER
Homeదర్వాజస్త్రీలోని ఆర్థ్రతను ఒడిసిపట్టుకున్న 'కొత్తపొద్దు కోసం'

స్త్రీలోని ఆర్థ్రతను ఒడిసిపట్టుకున్న ‘కొత్తపొద్దు కోసం’

- Advertisement -

ఈ మధ్యన కవిత్వం విరివిగా రాస్తున్న వారు చాలామంది ఉన్నారు కానీ తన చుట్టూ ప్రపంచాన్ని గమనిస్తూ సమస్యలన్నీ తన మనసులోకి ఒప్పుకొని వాటిని తన బాధగా భావించి పఠిత హదయ అంతరాలలోకి తీసుకెళ్లేలాగున ఎంతో అర్ధతగా రాసే కవయిత్రులు చాలా అరుదుగా కనబడుతుంటారు. కవిత్వం చదివిన పఠితలో మనసును, మనిషిని కదిలించే విధంగా చేయగలగాలి. కవిత్వ పాదాలు వాటిభావం ఎటువైపైతే వెళుతున్నాయో అటువైపుగా పఠనాపరులను ముందుకు సాగే లాగున తీసుకెళ్లే గొప్పనైన కవిత్వం కొన్ని కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. ఆధునిక ప్రపంచంలో ఇంకా స్త్రీ తన చుట్టూ ఉన్నా పరిధిలలోనే జీవిస్తుంది. ఆ పరిధిలో తనను తాను బయట ప్రపంచానికి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఆ ప్రయత్నంలో జరిగే సంఘర్షణను పదునైన భావజాలంతో సాహిత్య రూపంలో ముందుకు తీసుకొస్తున్న కవయిత్రులలో ముందువరసలలో మనకు ”గట్టు రాధిక మోహన్‌” కనబడతారు. కవయిత్రి తన రెండవ తాజా కవితా సంపుటి అయినా ”కొత్త పొద్దు కోసం” ద్వారా మన ముందుకు వచ్చారు. ఈ సంపుటిలో మొత్తం 45 కవితలున్నాయి. మనం ఇప్పుడు తన కవిత్వంలోకి వెళ్లి చదువుదాం.
”నో ఎంట్రీ” ( పేజీ 23 ) కవితను తీసుకుంటే మొదట చక్కటి ఎత్తుగడతో ప్రారంభించారు ఆమెను చూస్తుంటే సూర్యుడు లేని ఆకాశంలా కనబడుతుందంటూ సూర్యుణ్ణి నుదుటిపై స్త్రీలు పెట్టుకునే బొట్టుతో పోల్చుతూ ఆరంభాన్ని ఆమె ఎవరు అని చెప్పుతూ ఆమె ముఖమంతా వెన్నెల మాయమైన అమావాస్యలా ఉందంటూ ప్రస్తుత ప్రస్థితిని తెలుపుతు అతను లేని ఆమె జీవితంలో చుట్టూరా ఇన్స్టాల్‌ చేయని సీసీ కెమారాలెన్నో ఆమెను ఒంటరితనపు అందాన్ని బందించాలని చూస్తుంటాయి అంటూ ఆమెకంటూ ఒక ప్రపంచం ఉంటుందని అందులోకి ఎలాంటి ఆంక్షలు లేని ఆమెకే సొంతం అయ్యే ప్రపంచంలోకి వేరే వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టాలని బాగోద్వేగమైన ముగింపు ఇచ్చారు. ఇక్కడ కవయిత్రి స్త్రీ కావడం వలన స్త్రీయొక్క అంతరంగాన్ని ఎంతో ఆలోచనాత్మకంగా ఆవిష్కరించారని చెప్పొచ్చు.
మరో కవితలో ”ఈ పిడికెడు గుండెలో” ( పేజీ 44 ) లో స్త్రీలోని గుండె నాలుగు గదులలో ఒక్కొక్క అరా గూర్చి చెప్పుతూ ఒక అరలో భర్తని మరో రెండు గదులలో తల్లిదండ్రులని మరో అరలో పిల్లలని చేర్చుతూ తనని పూర్తిగా ఖాళీతనం లేకుండా చేసుకున్నానని ఎంతో సంతోషంతో ఉండగా గుండేల్లో నిండిన తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన హదయంలో రెండు గదులు గెస్ట్‌ హౌస్‌ లుగా మారడంతో ఇప్పుడు పిడికెడంత తన గుండెలో ఖాళీతనంతో కడుపులోని పేగులన్నీ ముడేసుకొని పురిటివాసనను గక్కుతున్నాయి అని కన్నా తల్లిదండ్రుల విలువను తెలియజేసే అర్ధతతో కూడిన కవితను మలిచిన తీరు బాగుంది.
పేదరికం జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పుతూ ”ఎల్లిపాయ తొక్కు” కవితలో ఉడుకుడుకు బువ్వలో తొక్కేసుకోని తింటుంటే కండ్లల్లో ఏర్పడే మేరుపులను చూసి ఇంటిమీద నిలబడి నవ్వుకునే పేదరికం గమ్మున మెడవొంచుకుందంటూ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. అదేవిదంగా పేదరికం ఉన్నపటికీ తమ బిడ్డ చదువుకొని సర్కారు నౌకరి చేస్తే చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కలల్ని తీర్చకుండా వ్యవస్థలోపలకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళిక గూర్చి రాసిన ”పెత్రమాస బతుకమ్మ” కవితను చదువుతుంటే కళ్ళల్లో నీళ్లుతిరుగుతాయి. అక్కాచెల్లెళ్ల అనుభందం గూర్చి చెప్పుతూ ”ఎంగిలి” కవితలో నువ్వెంగిలి చేసిన అమ్మ గర్భంలో, నేను కూడా ప్రాణం పోసుకున్నందుకేమో మనఇద్దరి మధ్య రోజురోజుకు రుచిగా అంతు ‘చిక్కని’ పిలుపుగా మారుతుందని కవిత్వంగ మలచిన తీరు బాగుంది. కవయిత్రి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. తన కంటికి కనిపించే సమస్యని కవితా వస్తువుగా చేసుకొని ఆ కవిత్వంలో జీవాన్ని నింపి తడి ఉన్న అక్షరాలు ఆయుధాలుగా మలచడంలోను పఠితలో ఆలోచన రేతేక్కించే విధంగ కొనసాగించడంలో తన ప్రతిభ కనబడుతుంది.
నేడు రోజురోజుకి సామజిక మాధ్యమంలో గంటలతరబడి గడిపేస్తున్న ప్రజానీకాన్ని చూస్తున్నాము. మనషుల మధ్య దూరాన్ని చెరిపివేయడానికి వచ్చిన ‘సెల్‌ ఫోన్‌’ నేడు మనసుల దూరాల్ని పెంచుతుంది. ఇదే విషయాన్నీ కవయిత్రిగారు సోషల్‌ మీడియా మీద ‘బానిస సంకెళ్లను వేసుకున్న నేనొక రెక్కలు విరిగిన స్మార్ట్‌ పక్షిని’ అని చక్కటి సెటైర్‌ వేశారు. తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పరీక్షలో ‘ఫస్ట్‌’ వస్తే పట్టులంగ కొనిస్తానన్న నాన్న మాటలను, ఎల్లిపాయ తొక్కుతోని తిన్న సంగతులను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు అవి అన్నిఉన్న అప్పటి సంతోషం మాత్రం రావడం లేదంటూ ”పట్టు లంగ” కవితలో మనం చూడవచ్చు. ప్రతి ఆడపిల్లకు కాళ్ళకి ‘పట్ట గొలుసులు’ పెట్టుకొని అంతటా కలియ తిరగాలని, ఘళ్ళు ఘళ్ళుమని శబ్దం చేస్తూ ఆడుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఆ కోరికను తన అన్న తీర్చడంతో, కాళ్లకు పట్టీలతో చూసిన అన్నముఖంలో ఎండి నవ్వులు కురిసినయి అంటూ ‘అన్నచెల్లెల అనుభందమేమో బిగుసుకుపోతానే ఉన్నదంటూ’ అన్నచెల్లెల అనుబంధాన్ని ”పట్ట గొలుసు” కవితలో చూడొచ్చు. అనుక్షణం ఇంట్లో ఉండే అమ్మంటే నాన్నకు లోకువే అని అమ్మకి ఏం తెలువదు అనుకుంటాడు గాని అమ్మ ఇంట్లో అడ్మినిస్ట్రేటర్‌గా, ఇంజినీర్‌గా, డాక్టర్‌గా, ఆర్థికవేత్తగా, బ్యూటిషన్‌గా ఇంట్లోని అందరికి అన్ని రకాలుగా అనగా అల్‌ ఇన్‌ వన్‌ గా పనులు చేస్తూ అన్ని సమకూరుస్తుందని ‘నాన్నలంతా ఇంతేనేమో/ అమ్మలా తెలివిని ఒప్పుకోలేక/ తట్టుకోలేక పోతుంటారు’ అంటూ నాన్నపై ఒకింత అసహనాన్ని ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ అనే కవితలో ప్రదర్శిస్తుంది కవయిత్రి.
అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య రక్త సంభందం విడదీయరానిదై ఉంటూ కలకాలం కలిసుండేలా ఒకరికొకరు ప్రేమాప్యాయతలతో సంవత్సరానికి ఒకసారి ‘రాఖి’ని కట్టుకుంటూ ఇరువురు మధ్య ప్రేమను పంచుకునే గొప్పనైనా సంప్రదాయం. కానీ నేడు అప్డేట్‌ వర్షన్లలో పడి విలువలేని దారంగా మారి వాట్సాప్‌, ఫెస్‌ బుక్‌లో స్టేటస్‌గా మారిపోతుందని ఆవేదనను వ్యక్తపరుస్తుంది.
కవయిత్రిలోని అభిరుచిని గమనించినట్లయితే తనకు ఏదైనా వస్తువు కానీ ఆలోచనను కానీ ఊహను కానీ చాలా సులువుగా ఆలోచింపజేసేలా కవిత్వికరించగలదు. తన కవితలలో ఎన్నోజీవన వాస్తవాలను ఉటంకిస్తూ ప్రశ్నిస్తుంది, స్త్రీల జీవితాల్లోని బాధాకరమైన దుఃఖ సన్నివేశాలను పఠిత హదయాన్ని చేరేలాగా బలమైన భావజాల కవితలు ఈ పుస్తకంలో అనేకం కలవు. చక్కటి కవితా సంపుటిని అందించిన కవయిత్రి ని అభినందిస్తూ.
– గాజోజి శ్రీనివాస్‌, 9948483560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -