Monday, June 16, 2025
E-PAPER
Homeమానవిమహిళా డ్రైవర్ల ఆత్మ‌గౌర‌వానికై

మహిళా డ్రైవర్ల ఆత్మ‌గౌర‌వానికై

- Advertisement -

ఎ. మోహన సుందరి… మహిళా ఆటో డ్రైవర్ల గౌరవం, న్యాయమైన వేతనాల కోసం ఒక సాహసోపేతమైన ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. ఒకప్పుడు మహిళలు ఆటో నడుపుతుంటే వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు అది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అందుకే చెన్నై నగరంలోని మహిళా ఆటో డ్రైవర్ల సమిష్టి ‘వీర పెంగల్‌ మున్నేత్ర సంఘం’ ఆధ్వర్యంలో సమాన వేతనం కోసం పోరాడుతున్నారు. తమ శ్రమ, గౌరవం, భద్రత కోసం కృషి చేస్తున్నారు. జాతీయ గుర్తింపు పొందుతున్నారు.
దాదాపు ముప్పై ఏండ్ల కిందట చెన్నై నగర వీధిల్లో మహిళలు ఆటో నడుపుతుంటే విచిత్రంగా చూసేవారు. కానీ 2025లో చాలా మంది మహిళలకు ఆటో నడపడం అవసరంగా మారింది. పురుషాధిక్యత కలిగిన ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ మహిళలు ముందుకు వస్తున్నారు. 39 ఏండ్ల బ్యూటీషియన్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ స్టాల్‌ యజమాని ఎ.మోహనసుందరి మొట్టమొదటి సారి ఆటో నడపడం మొదలుపెట్టారు. 15 ఏండ్లకు పైగా వ్యాపారం చేసిన ఆమె కరోనా తర్వాత ఆటో నడపేందుకు సిద్ధమయ్యారు. నగర రవాణా వ్యవస్థలో ఆమె తీవ్రమైన లింగ వివక్షను ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగానే ఆమె చివరికి 45 మంది సభ్యులతో కూడిన వీర పెంగల్‌ మున్నేట్ర సంగంను ఏర్పాటు చేశారు. దీనికి అర్థం ‘వీరోచిత మహిళల పురోగతి కోసం సంఘం’. ఇందులో ఆటోరిక్షా, క్యాబ్‌, డెలివరీ వెహికల్‌ డ్రైవర్లు ఉంటారు.
ఆరుగురితో మొదలై…
వీర పెంగల్‌ మున్నేట్ర సంఘం ఓ వాట్సాప్‌ గ్రూపు కూడా ఏర్పాటు చేసుకుంది. ‘నేను మహిళా డ్రైవర్లను కలిసిన ప్రతి జంక్షన్‌లో వారి ఆందోళనలు, మనోవేదనలను పంచుకున్నాను. వారిని గ్రూప్‌లో చేర్చాను’ అని మోహనసుందరి పంచుకున్నారు. ఈ బృందం మొదట ఆరుగురు మహిళలతో ప్రారంభమైంది. ఆటో నడపాల్సిన లైన్లు ఎంపిక చేసుకోవడం, మంచి ఛార్జీలను పొందడం, స్కూల్‌ డ్రాప్స్‌, స్టేషన్‌ పికప్‌లను నిర్వహించడంపై అవసరమైన సలహాలు సూచనలను దీని నుండి పొందారు. నెమ్మదిగా డ్రైవింగ్‌కి అవసరమైన జ్ఞాన భాండాగారాన్ని నిర్మించుకున్నారు. నేడు వారిలో కొందరు రోజుకు రూ.2,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు. అయితే ఈ ప్రయాణమేమీ అంత సజావుగా సాగలేదు. ఎంతో కష్టపడి ఈ విజయాలు సాధించారు.
మానేయమని బెదిరించారు
‘పురుష డ్రైవర్లు నెలకు రూ.50,000 వరకు సంపాదిస్తున్నారని, ఇళ్ళు కట్టుకుంటున్నారని, పిల్లలను కాలేజీకి పంపుతున్నారని విన్న తర్వాత నేను 2021లో ఆటో నడపడం ప్రారంభించాను. అయితే నేను ఆటో స్టాండ్‌లో కనిపించిన రోజు నన్ను వెళ్లిపొమ్మన్నారు. ఇది మహిళల పని కాదని మగ ఆటో డ్రైవర్లు నన్ను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కొందరైతే ఈ పని మానేయమని బెదిరించారు’ అని మోహనసుందరి పంచుకున్నారు. అయితే ఈ ప్రతిఘటన ఆమెను మరింత ఉత్సాహపరిచింది. కరోనా సమయంలో మహిళలు సహాయ సామాగ్రిని రవాణా చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అదే సమయంలో వారు ఎదుర్కొంటున్న లోతైన అసమానతలను కూడా గ్రహించారు.
సంఘం అవసరం
బలమైన సంఘాల ద్వారా పురుష డ్రైవర్లకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ‘మేము కొత్తవాళ్ళం, నిరక్షరాస్యులం. దాంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజుల తరబడి వేచి ఉండి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాళ్ళం’ అని ఆమె అన్నారు. అప్పుడే వారికి సంఘం ఏర్పాటు ప్రాధాన్యం గురించి తెలిసింది. ‘వీర పెంగల్‌ మున్నేట్ర సంఘం’ అనే సంస్థను తమిళనాడు ప్రభుత్వంతో ఒక సొసైటీగా నమోదు చేసినప్పుడు, వాట్సాప్‌ సంభాషణలుగా ప్రారంభమైన ఇది 2024 ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించబడింది. ఈ బృందంలో ఇప్పుడు పోలీసు, చట్టపరమైన సమస్యలకు సంబంధించిన న్యాయవాది ఉన్నారు. ఇప్పుడు దీన్ని తమిళనాడులో మహిళా డ్రైవర్ల కోసం మొట్టమొదటి రవాణా సహకార సంఘంగా నమోదు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వ్యవస్థాగత అడ్డంకులు
2023లో థానేలో జరిగిన ఒక పరిశోధనాత్మక అధ్యయనం ప్రకారం మహిళలు ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటో డ్రైవింగ్‌లోకి ప్రవేశిస్తారు. కానీ వారు విశ్రాంతి గదులు లేకపోవడం, అవమానాలు, వివక్ష, వేధింపులు వంటి వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటారు. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వ మద్దతు, అవగాహన ప్రచారాలు అవసరం. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూణేలోని బాగ్‌టోరు రిక్షా మహిళా సంఘం అధ్యక్షురాలు సోనీ షెండ్జ్‌ మాట్లాడుతూ ‘ఒక మహిళ తన కుటుంబాన్ని పోషించడానికి అడుగు బయటపెడితే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది’ అన్నారు. వీర పెంగల్‌ మున్నేత్ర సంఘంలోని చాలా మంది ఒంటరి మహిళలు. వారిలో కొందరు పిల్లల పోషణతో పాటు ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా సేవలు అందిస్తున్నారు. అందువల్ల పనిలో వారికి అవసరమైన సహకారం అవసరం.
సమూహంగా వెళ్లినపుడు
సమిష్టి సభ్యురాలైన 47 ఏండ్ల లీలా రాణి 23 ఏండ్లుగా ఆటోరిక్షా నడుపుతోంది. ఆమె తన పిల్లలను చదివించేందుకు, వారిలో ఇద్దరికి వివాహం చేయడానికి తగినంత డబ్బు సంపాదించింది. అయితే ఓలా, ఉబర్‌ వచ్చినప్పటి నుండి ఆమె ఆదాయం తగ్గిపోయింది. ‘పురుష డ్రైవర్ల వల్ల స్టాండ్‌ వద్ద ప్రయాణీకులను ఎక్కించుకోవడం మాకు కష్టతరమవుతుంది. అలాగే కొంతమంది ప్రయాణీకులు మహిళా డ్రైవర్‌ను నిరుత్సాహపరుస్తున్నారు. కొన్నిసార్లు, ప్రయాణీకులు మమ్మల్ని అనుచితంగా తాకుతారు. అందుకే సాయంత్రం పూట ఆటో నడపడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల ఆదాయం కూడా తగ్గిపోతుంది. కానీ మేము సమిష్టిగా ఏర్పడినప్పటి నుండి ఏ ప్రాంతంలోనైనా మరొక మహిళా డ్రైవర్‌ సహాయం పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. ఒక సమూహంగా వెళ్లినప్పుడు ఫిర్యాదులు వేగంగా నమోదు చేయబడతాయి’ అని ఆమె పంచుకున్నారు.
సురక్షితంగా, ఆచరణీయంగా..
వీర పెంగల్‌ మున్నేత్ర సంఘం ప్రతి సభ్యుని నుండి నెలవారీగా రూ.222 విరాళాన్ని తీసుకుంటుంది. ఈ డబ్బును ప్రభుత్వ పథకాల రిజిస్ట్రేషన్‌, ప్రమాదానికి గురైన డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఆరోగ్య బీమా కోసం వాడతారు. మెట్రో స్టేషన్ల వెలుపల మహిళలకు మాత్రమే ఆటో స్టాండ్‌, పగటిపూట తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తగినంత విశ్రాంతి గదులు, లాంజ్‌లు ఉండాలని మహిళా డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ‘చెన్నైలో సుమారు 600 మంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారు. శిక్షణ పొంది, లైసెన్స్‌లు తీసుకుని డ్రైవింగ్‌ చేయని మరో 600-700 మంది ఉన్నారు. మేము గణనీయమైన సంఖ్యలో ఉన్నాము. కాబట్టి ఈ వ్యవస్థలో మాకు స్థానం ఉంది. అది సురక్షితంగా, ఆచరణీయంగా ఉండాలి. అదే మా డిమాండ్‌’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -