Monday, June 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఫారెస్ట్‌ వర్సెస్‌ రెవెన్యూ

ఫారెస్ట్‌ వర్సెస్‌ రెవెన్యూ

- Advertisement -

– దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్య రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో వివాదం
-పరిష్కారాన్ని ప్రస్తావించని ‘భూభారతి-2024’

– మాటలకే పరిమితమైన ఉమ్మడి సర్వే
”రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 35 చోట్ల ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం నడుస్తోంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ”సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటాం. ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చే ‘భూభారతి-2024’ చట్టంతో ఈ సమస్యకు చెక్‌పెడతాం” అని గతేడాది శీతాకాల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కానీ జూన్‌ 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలో ఈ సమస్యను ప్రభుత్వం మచ్చుకైనా ప్రస్తావించలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు శాఖల మధ్య పెండింగ్‌లో ఉన్న దాదాపు 10 లక్షల భూముల గెట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆసిఫాబాద్‌ జిల్లాలో రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేసిన 70 వేల ఎకరాలకు పైగా భూములను అటవీ శాఖ తమదిగా వాదిస్తోంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మండలాల్లో ఈ రెండు శాఖల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క అసిఫాబాద్‌ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మద్య దాదాపు 10 లక్షల ఎకరాలు వివాదంలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకు రెండు శాఖల మధ్య భూముల హద్దుల నిర్ణయం జరగక పోవటం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అధికారులు చెబుతున్నారు. గతంలో అసైన్మెంట్‌ కమిటీలు అటవీ భూములను ఆనుకుని జారీ చేసిన పట్టాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములు కూడా ఈ వివాదంలో ఉన్నాయి. ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్మెంట్‌ కమిటీలు మూడు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు స్థానిక పరిస్థితులను బట్టి భూమిని పంపిణీ చేశాయి. వాటికి లావోణీ పట్టాలు ఇచ్చిన రెవెన్యూశాఖ చాలా ప్రాంతాల్లో అధికారికంగా హద్దులు చూపించలేదు. లావోణీ పట్టాలు పొందిన వారికి స్థానిక పట్వారీలు ఇదే నీ సరిహద్దు అంటూ ఖాళీగా ఉన్న స్థలాలను చూపించారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉంది. కాని మోఖమీద భూమి లేదు. ఎందుకంటే ఈ భూమి మాదంటూ అటవీ అధికారులు సదరు పట్టాదారున్ని తరిమి, కందకం తవ్వి కంచెలు కడుతున్నారు. ఎదురు తిరిగితే కేసులు పోలీసు స్టేషన్లు. అయినా పంచాయితి తెగడం లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉన్న చోట ఉమ్మడిగా రెండూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. అయినా వివాదం పరిష్కారం కావడం లేదు. ఇది మా భూమని రెవెన్యూ శాఖ అధికారులు, ఇది మా భూమని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మా సర్వే కరెక్టంటే… మా సర్వే కరెక్టని ఇరు వర్గాలు గొడవ పడుతున్నాయి. గతేడాది అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఆంగీకరించింది. ఈ వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడతామని ప్రకటించినా, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు.
అటవీ భూముల గుర్తింపులో ఏక పక్షం
అటవీ భూముల గుర్తింపులో ఆ శాఖ ఏక పక్షంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అటవీ భూములు నిర్దారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దాంతో రిజర్వు ఫారెస్టు హద్దులు గుర్తించడం కష్టంగా మారింది. అటవీ అధికారుల సర్వే మెకానిజం ప్రకారం ఏక పక్షంగా గుర్తిస్తున్నారు. సెక్షన్‌ 4 ప్రకారం ఈ భూమి తమదని అటవీశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. అ తర్వాత సదరు భూమని తమ ఆధీనంలో తీసుకుని కందకాలు తవ్వడం, కంచెలు నిర్మించడం లాంటి చర్యలు పాల్పడుతోంది. అటవీ శాఖ చర్యలను భూ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇరు శాఖల మధ్య సరిహద్దు వివాదాలున్న చోట వాటి పరిష్కారానికి ముందు సెటిల్‌మెంట్‌ అధికారిని నియమించాలి. ఆ తర్వాత రెండు శాఖలు జాయింట్‌ సర్వే చేయాలి. ఇందులో ఎవరిదని తేలితే వారికి ఆ భూమి చెందుతుంది. అయితే అటవీశాఖదని తేలితే మాత్రం సెక్షన్‌ 5 ప్రకారం సమగ్ర రిపోర్ట్‌ తయారు చేయాలి. అలాగే సెక్షన్‌ 6 ప్రకారం పరిహరం ప్రకటించాలి. ఇలా వివిధ దశల అనంతరం సెక్షన్‌ 15 ప్రకారం అటవీ శాఖకు అధికారికంగా రెవెన్యూ శాఖ నుంచి భూమి బదిలీ అవుతుంది. అలాంటి చర్యలు తీసుకోకుండానే ఏక పక్షంగా అటవీ శాఖ సరిహద్దు వివాదాలున్న భూములను స్వాదీనం చేసుకుంటోందని ఆరోపణలున్నాయి.
జాయింట్‌ సర్వేనే సమస్యకు పరిష్కారం : టి. సాగర్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఏండ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రకటించింది. కొత్తగా తీసుకుకొచ్చిన భూ భారతి చట్టంలో ఇరు శాఖల మధ్యనున్న సరిహద్దు వివాదాలను కనీసం ప్రస్తావించలేదు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులు తమ భూములను ఖాళీ చేయాలని అటవీశాఖ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో పండించిన పంటలను నరికివేస్తున్నారు. ప్రభుత్వం ఇరు శాఖలతో జాయింట్‌ సర్వే నిర్వహించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -