నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ ఘోర ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) మృతి చెందినట్టు సమాచారం. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ తొలుత నెట్టింట వైరల్గా మారింది. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్ జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
భాజపాకు చెందిన విజయ్ రామ్నిక్లాల్భాయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 133 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.