నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (65) మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం మంథని నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంథని మాజీ ఎమ్మెల్యే, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడన్నారు. రాంరెడ్డి మృతితో మంథని ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి, ఐదేళ్లపాటు ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తనవిగా భావించి పనిచేశారు.
ముఖ్యంగా రైతుల కష్టాలు, సాగునీటి సమస్యలు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. పదవులు కంటే ప్రజలే ముఖ్యమని నమ్మిన నేతగా, రాజకీయాలకు మానవత్వాన్ని జోడించిన వ్యక్తిగా రాంరెడ్డి గుర్తుండిపోతారు. రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైనది. మంచితనానికి, సహృదయానికి మారుపేరుగా నిలిచిన ఆయన ఇక లేరన్న నిజం మంథని ప్రజలకు తీరని లోటుగా మారింది. రాంరెడ్డి మృతి పట్ల పలువురు ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



