గొర్రెల మేకల పెంపందారుల సంఘం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెలు,మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల మందులు పంపిణీ చేయాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సిహ్మ డిమాండ్ చేశారు. సోమవారం గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం మద్దెపురం రాజు అధ్యక్షతన భువనగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ .. ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గొర్రె,మేకలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం లేదన్నారు. తప్పని పరిస్థితిలో గొర్రెల పెంపకందారులు వేలాది రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు.
గొర్రెల కాపరుల్లో ఎక్కువ శాతం నేటికీ నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్ని మెడికల్ కంపెనీలు, మెడికల్ షాపుల యజమానులు నకిలీ నాసిరకం మందులు కట్టపెడుతున్నారు. ఫలితంగా నట్టల నివారణ జరగటం లేదు.క్రమంగా జీవాల్లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.అదేవిధంగా గొర్లకాపరులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు.
మందుల కొనుగోలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు కాంట్రాక్టులు ఫైనల్ చేసినప్పటీకీ,నట్టల మందులు మాత్రం పంపిణీ చేయడం లేదు.ఇటీవల కేవలం 30శాతం గొర్రెలకు మాత్రమే బ్లూటంగ్ వాక్సిన్ చేశారు.నట్టల నివారణ మందులు ఇవ్వకుండా వరుసగా వ్యాక్సినేషన్ చేస్తుండటంతో జీవాలు బలహీనపడుతాయని గొర్రెల కాపరులు భయపడుతున్నారు.ఓ వైపు నట్టల నివారణ మందు త్రాగించిన వారం రోజుల తర్వాత వ్యాక్సినేషన్ చేస్తే ఉపయోగముంటుందని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.కానీ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతున్నట్లు కనపడుతుంది.దీంతో ప్రభుత్వ సొమ్ము కూడా వృధా అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి నట్టల మందుల డోసు ధరను కనీసం రూ.5/- లకు పెంచి,అన్ని రకాల మందులకు సరిపడా బడ్జెట్ను ఇవ్వాలని,నాణ్యమైన మందులను మాత్రమే కొనుగోలు చేయాలని,వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా నట్టల మందును త్రాగించాలని,కొత్త డ్రగ్స్ను ప్రవేశపెట్టాలని,నట్టల మందును సంవత్సరానికి 4 సార్లు డ్రగ్స్ మార్చి ఇవ్వాలని,నట్టల నివారణ కార్యక్రమానికి మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనుసంధానం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శులు కొండె శ్రీశైల,మద్దెపురం బాలనర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాక జహాంగీర్, నారీ వెంకటేష్, జెనిగెల యాదయ్య, కడారి క్రిష్ణ పాల్గొన్నారు.