ముంబయిలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ
రాఫెల్ డీల్ కుదిరిన తర్వాత వచ్చిన మక్రాన్
ముంబయి: ప్రపంచం అనిశ్చితి దశలో ఉన్న తరుణంలో ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యం స్థిరత్వానికి ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. లోక్ భవన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాక్రాన్తో కలిసి ఆధిపత్యం పై పోరాడేందుకు పరస్పర భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ను ఒకటిగా పేర్కొంటూ.. ఈ సంబంధాన్ని ‘చాలా ప్రత్యేకమైనది’ అని అన్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. లోక్భవన్ నుంచి బెంగళూరులో ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ అసెంబ్లీంగ్ లైన్ను వర్చువల్లో ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరం వరకు ఎగిరే ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారతదేశం, ఫ్రాన్స్ కలిసి తయారు చేసి ఎగుమతి చేయడం గర్వంగా ఉందని అన్నారు.
వ్యూహాత్మక భాగస్వామ్యం : మాక్రాన్
”భారత్, ఫ్రాన్స్ల మధ్య ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు. ఇది కేవలం వ్యూహాత్మకమే కాదని, ప్రపంచ ప్రగతికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ”హెలికాప్టర్ అసెంబ్లీంగ్ లైన్ ప్రారంభోత్సవం మా లోతైన సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. మేము కలిసి ఎవరెస్ట్కు వెళ్లే హెలికాప్టర్ను తయారు చేస్తాము. భారతదేశం-ఫ్రాన్స్ బంధానికి సరిహద్దులు లేవు. ఇది సముద్రపు లోతులను, ఆకాశ ఎత్తులను చేరుకోగలదు” అని వివరించారు. ఫ్రాన్స్తో కేంద్రప్రభుత్వం ఫ్రేమ్వర్క్ కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనను భారతదేశం క్లియర్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడి పర్యటనకు రావటం గమనార్హం.



