నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుస్తకాలతో స్నేహం చేస్తే విద్యార్థులు తమ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. సెల్ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల సమయం వృథా అవుతుందని, ప్రభుత్వం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 2 న ప్రముఖ బాల సాహితీ వేత్త హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ దినోత్సవం ద్వారా పిల్లల ఊహాశక్తి కి రెక్కలు వస్తాయని చెప్పారు. గ్రంథాలయ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక సమీక్షకుల బృందంలో ఉన్న విద్యార్థులు తాము చదివిన పుస్తకాలపై సమీక్షలు చేసి ఆకట్టుకున్నారు. గోటీలాట, చిట్టిచేతులు, పంచదార చిలుకలు, బాలచెలిమి జాతీయ కథలు వంటి పుస్తకాలపై విద్యార్థులు చేసిన సమీక్షలు అందరినీ మెప్పించాయి. అనంతరం పుస్తక సమీక్ష చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాలసాహితీవేత్త సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, ఉపాధ్యాయులు నరసింహారావు, పుల్లయ్య, దుర్గయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



