Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనగర వీధుల నుంచి ఐఐటీ కలల దాకా

నగర వీధుల నుంచి ఐఐటీ కలల దాకా

- Advertisement -

– పారిశుధ్య కార్మికుల పిల్లలకు తొలిసారి ఎక్స్‌పోజర్‌ విజిట్‌
– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రత్యేక చొరవ
నవతెలంగాణ- సిటీబ్యూరో

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ ప్రత్యేక చొరవతో పారిశుధ్య కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశల దీపం వెలిగించే వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారు. ఈ పిల్లల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌ ద్వారాలు తెరిచింది. వారికి కేవలం క్యాంపస్‌ పర్యటన మాత్రమే కాకుండా, ఆశలు, అవకాశాలు, అపారమైన భవిష్యత్‌కు దారి చూపే అనుభవాన్ని జీహెచ్‌ఎంసీ కల్పిస్తోంది. జనవరి 31(నేడు) నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్ల నుంచి ఎంపికైన పారిశుధ్య కార్మికుల పిల్లలు ఈ ప్రత్యేక ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో పాల్గొననున్నారు. ఇది కేవలం ఫీల్డ్‌ విజిట్‌ మాత్రమే కాకుండా, నగరాన్ని నిశ్శబ్దంగా నిలబెట్టే కుటుంబాల పిల్లల మనసుల్లో పెద్ద కలలకు బీజం వేసే కార్యక్రమంగా నిలవనుంది. ఐఐటీ అధ్యాపకులు, విద్యార్థులతో పరస్పర చర్య, అకడమిక్‌ భవనాలు, గ్రంథాలయాలు, ఇన్నోవేషన్‌ సెంటర్ల సందర్శన, ప్రేరణాత్మక సమావేశాల ద్వారా ఈ పిల్లలకు ఒక ప్రపంచ స్థాయి విద్యా వాతావరణాన్ని పరిచయం చేయనున్నారు. చాలా మంది పిల్లలకు ఇది తొలిసారి ప్రపంచ స్థాయి విద్యాసంస్థను చూడనున్న అనుభవం కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ హైదరాబాద్‌లోని ఈ-సెల్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్నది. రవాణా, భోజనం, భద్రత, మార్గదర్శక సహాయం వంటి అన్ని ఏర్పాట్లూ ప్రత్యేకంగా చేపట్టి, ప్రతి పిల్లవాడికీ ఆత్మవిశ్వాసం కలిగేలా, విలువైన అతిథులుగా భావించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం నగర శుభ్రత కేవలం వీధులు శుభ్రంగా ఉండటమే కాకుండా, విద్య, సామాజిక ఎదుగుదలకు అడ్డంకులు తొలగించడమే నిజమైన స్వచ్ఛత అనే సందేశాన్ని బలంగా తెలియజేస్తోంది. హృదయాన్ని హత్తుకునే ఈ కార్యక్రమం ద్వారా జీహెచ్‌ఎంసీ శుభ్రమైన నగరాన్ని మాత్రమే కాదు. ప్రతి చిన్నారికీ ప్రకాశవంతమైన భవిష్యత్‌ను నిర్మిస్తోంది.
ఇదీ షెడ్యూల్‌
– 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఎంపిక
– ఒక్కో సర్కిల్‌కు ముగ్గురు విద్యార్థుల చొప్పున జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా మొత్తం 180 మంది విద్యార్థుల ఎంపిక
– ఈ విజిట్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు జరగనుంది.

ఎవరి కంటే తక్కువ కాదు : కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌
”హైదరాబాద్‌కు పారిశుధ్య కార్మికులే వెన్నెముక. ఈ కార్యక్రమం ద్వారా వారి పిల్లలకు వారి భవిష్యత్‌ కూడా ఎవరి కంటే తక్కువ కాదని చెప్పాలనుకుంటున్నాం. ఈ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ చిన్నదైనప్పటికీ, వారు తమపై నమ్మకం పెంచుకుని, పరిమితులు లేకుండా కలలు కనేందుకు దోహదపడే కీలక అడుగు.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -