నవతెలంగాణ – ఆలేరు రూరల్
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం రమాదేవి మాట్లాడుతూ.. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దాతల సహకారం కొనియాడదగినదని, ఇది ఉపాధ్యాయుల బాధ్యతను మరింత పెంచుతుందని అన్నారు.
ఉపాధ్యాయులందరూ రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ఈ విద్యాసంవత్సరంలో కూడా పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలిపారు.కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు బండి వంశీ, కళ్లెపు సుభాష్, అంబాల రాకేష్, జన్నే శ్రీను, జన్నే బిక్షపతి, ఉపాధ్యాయులు రవికుమార్, శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేష్, ఖాజా అలీ, జయశ్రీ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులందరికీ భోజనం ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థి బండి ప్రశాంత్ను ఈ సందర్భంగా అందరూ అభినందించారు.



