ఎన్పీిఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్
సంఘం 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్లో నిధులు పెంచాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం ఎన్పీఆర్డీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షులు కె .వెంకట్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జాలి, దయ, కరుణ మాకొద్దని, మా హక్కులు మాకు కావాలి’ అంటూ దేశ వ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేయడానికి 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఎన్పీఆర్డీ కలకత్తాలో ఏర్పడిందన్నారు. ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులను సమీకరించి పోరాటాలు చేస్తుందన్నారు.
2016 ఆర్పీడీ చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డులు, రైల్వేలో సౌకర్యాలు, సామూహిక ప్రాంతాలు అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్ట్సిట్యూట్ విలీననికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయాలు సాధించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21నుంచి 28వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, నాయకులు కేతావత్ మురళి, శ్రీనివాస్ రెడ్డి, నాగు నర్సింహ, పున్న శ్రీధర్, కర్ర కిషన్ తదితరులు పాల్గొన్నారు.



