– నిధులు రూ.32 కోట్ల 55లక్షల 60వేలు మంజూరు
– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ, వరద కాలువల మరమ్మత్తులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మరమ్మతుల కోసం నిధులు రూ.32 కోట్ల 55లక్షల 60వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.గత ప్రభుత్వంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక, ప్రభుత్వం నిధులు మంజూరు చేయక దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రాజెక్టు, కాకతీయ, వరద కాలువ మరమ్మత్తుల కొరకు రూ.32కోట్ల 55 లక్షల 60వేలు తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని అన్నారు.
కాకతీయ కెనాల్ 0 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్ల వరకు వివిధ మరమ్మత్తులకు కొరకు రూ.2కోట్ల 30లక్షలు, వరద కెనాల్ గాండ్లపేట్ వద్ద పడిన గండి పూడ్చడానికి రూ.8కోట్ల 52లక్షలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎర్త్ డ్యాం వద్ద వివిధ పనుల కొరకు రూ.89 లక్షల 60 వేలు, డ్యాం వద్ద మేజర్ పనుల కొరకు రూ.18 కోట్ల 27లక్షల 50 వేలు, ప్రాజెక్టు గేట్ల వద్ద ఎలక్ట్రికల్ కేబుల్స్, వివిధ పనులకు రూ.2 కోట్ల 56 లక్షల 50 వేల నిధులను ప్రభుత్వం మంజురు చేసినట్లు తెలిపారు.పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహకరించిన సుదర్శన్ రెడ్డికి ముత్యాల సునీల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.



