నవతెలంగాణ హైదరాబాద్: మంత్రిగా గడ్డం వివేక్ వెంకట స్వామి తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం సెకండ్ ప్లోర్ లో తనకు కేటాయించిన చాంబర్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ఫైల్ మీద తొలి సంతకం చేశారు మంత్రి వివేక్. మొత్తం 46 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసే రూ.2600 కోట్ల నిధుల ఫైల్ పై సంతకం చేశారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామికి సెక్రటేరియట్ లో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనతో పాటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. పాతమంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా.. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు.. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు కేటాయించారు. తాజా విస్తరణతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కి చేరింది.