Thursday, June 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగాంధీ.. గిదేందీ..?

గాంధీ.. గిదేందీ..?

- Advertisement -

సమస్యల వలయంలో గాంధీ ఆస్పత్రి
తరచూ నీటి సరఫరాలో అంతరాయం
అస్తవ్యస్తంగా అగ్నిమాపక వ్యవస్థ
బిల్లులు చెల్లించక నిలిచిన ఫోన్‌ సేవలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ధర్మాస్పత్రిగా పేరున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అన్నీ సమస్యలే. తరచూ నీటి సరఫరా నిలిచిపోతుంది. ఆస్పత్రిలో మురుగునీరు ప్రవాహంలా పారుతుంది. తరచూ లిప్ట్‌లు మొరాయిస్తున్నాయి. బిల్లు చెల్లించకపోవడంతో ఫోన్‌ సేవలు నిలిచిపోయాయి. సాయంత్రం ఓపీ సేవలు బంద్‌ అయ్యాయి. అగ్నిమాపక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధార్‌ కార్డు లేకుంటే వైద్యం అందించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అత్యవసర విభాగంతోపాటు ఓపీ సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓలు పర్యవేక్షించాల్సి ఉండగా.. అలాంటిదేమీ జరగడం లేదు.
మొరాయిస్తున్న లిప్ట్‌లు
1200 బెడ్ల సామర్థ్యం గల గాంధీ ఆస్పత్రికి ప్రతి సోమవారం సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటే.. ఆస్పత్రి స్థాయికి మించి ఇన్‌ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సమస్యతో ఉత్పన్నమవుతోంది. ఆస్పత్రి ప్రాంగణంలో అప్పుడప్పుడు మురుగునీరు ప్రవహించడంతోపాటు పై అంతస్థుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిప్ట్‌ మొరాయిస్తుంది. రెండో అంతస్థులో ఉన్న చర్మ, లైంగిక వ్యాధుల ఓపీ విభాగానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిప్ట్‌కు కూడా తరచూ అంతరాయం ఏర్పడుతుండటంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు.
మదర్‌ చైల్డ్‌ సెంటర్‌లో..
200 పడకల సామర్థ్యంతో ఇటీవల నిర్మించిన సూపర్‌ స్పెషాల్టీ మాతా శిశుఆరోగ్య కేంద్రంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. బాలింతలు, గర్భిణుల వెంట ఉండే సహాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. సహాయకుల షెల్టర్‌ సరిపోకపోవడంతో ఆస్పత్రి బయటే రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు ఆస్పత్రి నుంచి వెలువడే మురుగునీరు పొంగి బయటకు రావడంతో ఆ పక్కనే విశ్రాంతి తీసుకుంటున్న సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. వెయిటింగ్‌ హాల్‌ కూడా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ల వద్దే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
నీటి సరఫరాకు అంతరాయం
గాంధీ ఆస్పత్రిలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం రాత్రి ఈ సమస్య నెలకొనడంతో సంబంధిత యంత్రాంగం సకాలంలో స్పందించలేదని రోగుల సహాయకులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో పంప్‌ హౌస్‌లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ట్రిప్‌ కావడంతో ఆయా వార్డులు, ఎమర్జెన్సీ విభాగాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. శనివారం బక్రీద్‌ సెలవుదినం కావడంతో నీటి సరఫరా పునరుద్ధరణ నత్తనడకన సాగింది.
నిలిచిన ఫోన్‌ సేవలు
గాంధీలో వైద్యానికి సంబంధించిన 30 సేవల విభాగాలు.. వాటి ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు, ఓపీ, అత్యవసర విభాగాలు వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ కొనసాగే ఆర్‌ఎంఓలు, పరిపాలన విభాగం, ఎస్టాబ్లిష్‌మెంట్‌, బ్లడ్‌ బ్యాంకు, డ్రైట్‌, సెక్యూరిటీ, పారిశుధ్యం, ఫార్మసీ తదితర విభాగాలున్నాయి. వాటిని సమన్వయం చేస్తూ పనులు సవ్యంగా జరిగేందుకు ఉపయుక్తంగా సుమారు 400 టెలిఫోన్‌ ఇంటర్‌కంలు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ నిలిచిపోవడంతో వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది. బిల్లు రూ.5.76 లక్షలు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. ఏడాదిగా బకాయిలు చెల్లించకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సర్వీస్‌ను నిలిపేసింది. సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓలు, ముఖ్య వైద్యులు, అధికారులకు అధికారికంగా కేటాయించిన నెంబర్లు కూడా పనిచేయకపోవడం గమనార్హం.
ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం
గాంధీ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నీటి సమస్యను తాత్కాలికంగా పునరుద్ధరించాం. వాటర్‌ ట్యాంక్‌తో నీటిని సరఫరా చేస్తున్నాం. ఇటీవల కొద్దిసేపు కరెంట్‌ పోయింది. వెంటనే జన్‌రేటర్‌ సాయంతో విద్యుత్‌ను పునరుద్ధరించాం. అవసరమైన వైర్ల కోసం ఆర్డర్‌ పెట్టాం. రాగానే సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– డాక్టర్‌ రాజకుమారి, సూపరింటెండెంట్‌,
ముందుకు సాగని అగ్నిమాపక వ్యవస్థ ఆధునీకరణ
అన్ని విభాగాల వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లు, రక్త నిధి కేంద్రం, ఆరోగ్యశ్రీ వార్డులు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్య పరీక్షల కేంద్రాలు, సూపర్‌స్పెషాల్టీ విభాగాలు, పరిపాలనా కేంద్రం, వైద్య కళాశాల, వైద్య విద్యార్థుల వసతి గృహాలు ఇలా అనేక విభాగాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. నిత్యం ఓపీ రోగులు, వార్డుల్లో ఉన్న రోగులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, రోగుల సహాయకులు, వివిధ పనుల కోసం వచ్చివెళ్లే సందర్శకులతో కలిపి నిత్యం దాదాపు 10 వేల మంది వరకు ఆస్పత్రిలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత కీలకమైన పరిస్థితుల్లో అత్యంత ప్రధానమైన అగ్నిమాపక వ్యవస్థ కట్టుదిట్టంగా నిర్వహించడం లేదు. ఆస్పత్రిలో అగ్నిమాపక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రమాదవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2003లో ఆస్పత్రికి కొత్త భవనం అందుబాటులోకి రావడంతో అప్పటి అవసరాల మేరకే అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. వాటి పనితీరును ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ నిర్వాహణను చేపట్టాల్సిన యంత్రాంగం ఈ విషయాన్ని విస్మరించడంతో ప్రస్తుతం ఈ పరికరాలు తుప్పుబట్టి పనికిరాకుండా పోయాయి. దీంతో ఆస్పత్రిలో అగ్నిప్రమాదాల నుంచి రక్షణ అగమ్యగోచరంగా తయారైంది.
గతంలో ఆస్పత్రిలో పలుమార్లు స్వల్ప అగ్నిప్రమాదాలు సంభవించడంతో అగ్నిమాపక అధికారులు పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. దీంతో అగ్నిమాపక వ్యవస్థ ఆధునికీకరణకు రూ.2కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -