Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్ఉద్యోగాల పేరుతో టోకరా.. ముఠా అరెస్ట్‌

ఉద్యోగాల పేరుతో టోకరా.. ముఠా అరెస్ట్‌

- Advertisement -

– పలు జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు : ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వివరాల వెల్లడి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌ టౌన్‌ సీఐ సునీల్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. అనంత్‌ ఈ-సొల్యూషన్‌, విద్యాదాన్‌ ఎన్జీవో ఆర్గనైజేషన్‌ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా ఇచ్చింది. రెండు నెలల తరువాత వేతనాలు రాకపోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి ప్రధాన నిందితులు ఏ1 జట్టబోయిన మధు కిరణ్‌, ఏ2 మాదాసి సుధాకర్‌, ఏ3 నమ్మని సతీష్‌ను అరెస్టు చేశారు. ఏ4 సుజాత ఠాకూర్‌, ఏ5 లావణ్య పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు 2013లో ‘అనంత ఈ-సొల్యూషన్‌ పేరిట కంపెనీని స్థాపించి, అవుట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేశాడు. అనంతరం 2023లో సుజాత ఠాకూర్‌, నామిని సతీష్‌, లావణ్యతో కలిసి ‘విద్యాధాన్‌ ఆర్గనైజర్స్‌’ సొసైటీని రిజిస్టర్‌ చేసి, కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్‌ డబ్బులు దుర్వినియోగం చేయాలని ప్లాన్‌ వేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు వసూలు చేసి, నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా 240 మందిని మోసం చేసింది. వీరికి ఏజెంట్లుగా సహకరించిన రాహుల్‌, కోవా విఠల్‌(బోథ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌), వరలక్ష్మిపై ఇది వరకే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను తదుపరి పోలీస్‌ కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేస్తామని ఎస్పీ చెప్పారు. పలు జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిని, డబ్బులు అడిగే వారిని నమ్మొద్దని, అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సునీల్‌ కుమార్‌, ఐటీ కోర్‌ ఆర్‌ఎస్‌ఐ బి.గోపికృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -