నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం సృష్టించింది. ‘ఈగల్’ పోలీసులు నిర్వహిస్తోన్న ఆపరేషన్లో కాలేజీకి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 82 మంది వినియోగదారులను పోలీసులు గుర్తించారు. వారిలో 32 మంది మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా తేలింది.
వీరిలో 24 మందికి డ్రగ్స్ టెస్టు చేయగా…అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరంతా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. దీంతో ఈగల్ పోలీసులు, మెడిసిటీ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వాడినట్టు తేలిన 9 మంది విద్యార్థులను డీ-అడిక్షన్ సెంటర్కు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని ఈగల్ అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలోని బీదర్కు చెందిన జరీనా బాను, అరఫాత్ అహ్మద్ఖాన్ గంజాయిని హైదరాబాద్కు తీసుకొచ్చి పలువురు పెడ్లర్లతో సరఫరా చేయిస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు పరిశీలించగా.. రూ.1.5కోట్ల అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. అందులో రూ.26లక్షలు హైదరాబాద్కు చెందిన 51 మంది పెడ్లర్లు, మిగిలిన నగదు.. దాదాపు 100 మంది మధ్య లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ వంద మందిలో ఈ 32 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నట్టు ఈగల్ అధికారులు తెలిపారు.