– మేనిఫెస్టో అమలే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థి హామీ
నవతెలంగాణ-సదాశివపట
సదాశివపేట పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గారెల గౌరీదేవి తుల్జారం శుక్రవారం నాడు వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి తన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా గౌరీదేవి మాట్లాడుతూ, ఎన్నికల హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. ప్రజల ముందు ఉంచిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి మౌలిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వార్డు సమస్యలపై స్వతంత్రంగా పోరాడే అవకాశం ఉంటుందని గౌరీదేవి అభిప్రాయపడ్డారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ, గతంలో వార్డు ఎదుర్కొన్న సమస్యలు, అభివృద్ధిలో జరిగిన నిర్లక్ష్యంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రజల స్పందన సానుకూలంగా ఉందని, స్వతంత్ర అభ్యర్థిగా తనపై విశ్వాసం పెరుగుతోందని ఆమె తెలిపారు.చివరిగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గరెల గౌరీదేవి తుల్జారం ప్రజలను కోరారు.



