చండూరు మాజీ జడ్పీటీసి కర్నాటి వెంకటేశం
నవతెలంగాణ – చండూరు
గట్టుప్పల్ నుంచి పుట్టపాక గ్రామం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని జడ్పిటిసి మాజీ సభ్యుడు కర్నాటి వెంకటేశం పేర్కొన్నారు. శనివారం గట్టుప్పల్ లో విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో కోటి నాలుగు లక్షల రూపాయలు (1.4కోట్లు) పంచాయతీరాజ్ నిధుల నుంచి మంజూరయ్యాయి అన్నారు.
గట్టుప్పల్ నుంచి పుట్టపాక, తెరట్పల్లి నుంచి నామపురం, కొండాపురం నుంచి కొంపెల్లి రోడ్లకు ఒకే ప్యాకేజీలో శశాంక్ కు కాంట్రాక్టు ఇచ్చారు అని తెలిపారు. కానీ గట్టుపల్ – పుట్టపాక రోడ్డును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు. ఈ రోడ్డును ఆర్అండ్ బీ కి మార్చే ప్రయత్నం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా ఊహగానాలు వస్తున్నాయే తప్ప మార్చే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. స్థానిక నాయకులు చొరవ తీసుకొని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.



