ప్రజలపై దాడులు సరికాదు : ఇజ్రాయిల్కు ప్రపంచదేశాల హెచ్చరిక
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ ఆందోళన
ఐరాస భద్రతామండలి భేటీలో పలు దేశాలు
నెతన్యాహు చర్యను సమర్థించిన అమెరికా
న్యూయార్క్ : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గాజా సిటీని పూర్తిగా హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయిల్ ప్రణాళికను బ్రిటన్, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు ఎండగట్టాయి. ఈ ప్రణాళిక అంతర్జా తీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డాయి. గాజా యుద్ధంపై చర్చించేందు కు ఐరాస భద్రతా మండలి ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ హమాస్ నుంచి గాజాకు విముక్తి కల్పిస్తామని, ఆ నగరాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. నెతన్యాహూ ప్రకటనపై డెన్మార్క్, గ్రీస్, స్లొవేనియా కూడా మండిపడ్డాయి. నెతన్యాహూ తన ప్రణాళికను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రణాళికతో హమాస్ చెరలో ఉన్న బందీలు బయటప డకపోగా, వారి ప్రాణాలు మరింత ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. భద్రతా మండలిలోని పలు సభ్య దేశాలు కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశాయి. గాజా ప్రజలను శిక్షించడం ఆమోదయోగ్యం కాదని చైనా చెప్పింది. ఇజ్రాయిల్ చర్యలతో శత్రుత్వం మరింత పెరుగుతుందని రష్యా హెచ్చరించింది. సమావేశంలో ఐరాస సహాయ ప్రధాన కార్యదర్శి మిరస్లావ్ జెన్కా మాట్లాడుతూ ‘ఇజ్రాయిల్ ప్రణాళికను అమలు చేస్తే గాజాలో మరో విపత్తు సంభవిస్తుంది. అది మధ్యప్రాచ్యమంతటికీ వ్యాపిస్తుంది. బలవంతపు తరలింపులు, హత్యలు, విధ్వంసానికి దారితీస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయిల్ చర్యను అమెరికా వెనకేసుకొచ్చింది. బందీలను విడిపించి, యుద్ధాన్ని ఆపేందుకు వాషింగ్టన్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ఈ ప్రయత్నాలను సమావేశం అర్థం చేసుకోవడం లేదని అమెరికా రాయబారి దోరోతి షెయా వాపోయారు. తన వద్ద బందీలుగా ఉన్న వారిని హమాస్ వదిలేస్తే యుద్ధం ఈ రోజే ఆగిపోతుందని ఆమె చెప్పారు. ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతోందని నిందించేందుకు ఈ సమావేశాన్ని సభ్య దేశాలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. కాగా ఇజ్రాయిల్ ప్రణాళికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో చర్చించానని నెతన్యాహూ తెలిపారు.
గాజా స్వాధీన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES