నిలిచిన ట్రంప్ యుద్ధ ముగింపు ప్రణాళిక
మనామా : గాజాకు విభజన ముప్పు పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడనున్నదని తెలుస్తున్నది. ఒక భాగం ఇజ్రాయిల్ నియంత్రణలో, మరొక భాగం హమాస్ ఆధీనంలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరుగురు యూరోపియన్ అధికారులు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రూపొందించిన యుద్ధ ముగింపు ప్రణాళిక స్తంభించిపోవడంతో గాజా భవిష్యత్ అనిశ్చితంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.
ఇజ్రాయిల్ సైన్యం ప్రస్తుతం గాజాలో సుమారు 53 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. అందులో రఫా నగరం, గాజా నగరంలోని కొన్ని ప్రాంతాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. మిగతా ప్రాంతం హమాస్ నియంత్రణలో ఉన్నది. ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది గాజా ప్రజలు శిబిరాల్లో, శిధిలాల మధ్య జీవిస్తున్నారు. ఇజ్రాయిల్ సైన్యం గాజా సరిహద్దులో పసుపు సిమెంట్ బ్లాకులు పెట్టి ఒక గీత వేసింది. దీనిని యెల్లో లైన్ అని పిలుస్తున్నారు. ఈ గీతే భవిష్యత్తులో గాజా కొత్త సరిహద్దుగా మారే అవకాశం ఉన్నదని నిపునులు చెప్తున్నారు.
ట్రంప్ ప్రణాళికలో ఏముంది?
ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. ఇజ్రాయిల్ కొంత వెనక్కి వెళ్లాలి. ఒక తాత్కాలిక పాలనా సంస్థ ఏర్పడాలి. హమాస్ నిరాయుధీకరణ జరగాలి. గాజా పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. అయితే ఈ ప్రణాళికకు సమయ ప్రణాళిక లేకపోవడం, హమాస్, ఇజ్రాయిల్ మధ్య భారీ విభేదాలు ఉండటంతో అది నిలిచిపోయింది. గాజా విషయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు స్పందిస్తున్నాయి. గాజా అంటే ఒకటే ప్రాంతమనీ, దానిని విభజించకూడదని జోర్డాన్ మంత్రి అయ్మన్ సఫాది చెప్పారు. గాజా శాంతి, యుద్ధం మధ్యలో ఇరుక్కుపోకూడదని బ్రిటన్ మంత్రి యవెట్ కూపర్ అన్నారు. గాజాలో పాలస్తీనా అథారిటీ మళ్లీ పాలన చేపట్టాలని యూరోపియన్ దేశాలు కోరుతున్నాయి. కానీ ఇజ్రాయిల్ దీనికి అంగీకరించడం లేదు.



