నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో 16ఏండ్ల తరువాత చేపట్టనున్న జనగణనకు సోమవారం కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జనగణన మొత్తంగా 16వది కాగా స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన కానుంది. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రక్రియ 2027 మార్చి 1 నాటితో పూర్తి కానుంది. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026 అక్టోబర్ 1 నాటికి, రెండో దశలో భాగంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో 2027 మార్చి 1నాటికి జనగణన పూర్తి కానుంది. అయితే ఈసారి జనగణనతోపాటు కుల గణననూ చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని కేంద్ర హౌంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్టు పేర్కొంది. 1948 నాటి జనగణన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది. ఇక 2021లో జనగణన కోసం ప్రభుత్వం రూ.12,695.58 కోట్లను కేటాయించగా.. ఈసారి జనగణనకు రూ. 13 వేల కోట్ల వరకూ వ్యయం అయ్యే అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి కేంద్రం 2025-26 బడ్జెట్లో కేవలం రూ. 574.80 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది.
16 ఏండ్ల తరువాత..
దేశంలో జనగణనను ప్రతి పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో రెండు విడతల్లో ఈ ప్రక్రియను చేపట్టారు. వాస్తవానికి 2021లోనే జనగణనను నిర్వహించాలి. అయితే, కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు 16 ఏండ్ల తరువాత జనాభా గణననూ, దానితోపాటే తొలిసారిగా కులగణననూ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు గత నెలలో కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో ఓ కొత్త ప్రశ్న కూడా ఉంది. అదే ఈ జనగణన ప్రత్యేకత. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1931 నుంచి ఒకే విధమైన ప్రశ్నలే అడుగుతూ వస్తున్నారు. అయితే 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడు గుతారు. అదే మీ కులం ఏంటి? అని. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.
జనగణన అంటే ఏంటి?
ఒక దేశం లేదా ఒక ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం, విశ్లేషించడం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయస్సు, లింగం, భాష, మతం, విద్య, వ త్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరిం చనున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తారు.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది : జైరాం రమేశ్
జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేలవంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల ణన చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వ మరో యూటర్న్ కాదా? అని ప్రశ్నించింది. కుల గణనను మాత్రమే కాకుండా కులాల వారీగా సామాజిక, ఆర్థిక పారామితులపై వివరణాత్మక డేటా తెలిసేలా తెలంగాణ మోడల్ను అనుసరించాలని సూచించింది. 2026-27లో జరుగనున్న జనాభా లెక్కలకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ తరహాలోనే ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. జనాభా లెక్కల కోసం ప్రచారం చేసిన నోటిఫికేషన్నే చివరకు జారీ చేశారని, కానీ ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని విమర్శించారు. 2025 ఏప్రిల్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ను పునరుద్ఘా టించిందన్నారు. కాంగ్రెస్ డిమాండ్, ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి కులగణన డిమాండ్కు తలొగ్గారని, డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సల్స్గా పిలిచారని విమర్శించారు. అయితే కేంద్రమే కులగణన చేస్తామని ప్రకటించిందని, తాజా నోటిఫికేషన్లో మాత్రం దానిని ప్రస్తావించలేదని అన్నారు. జనాభా లెక్కల్లో తెలంగాణ నమూనాను స్వీకరించాలని కాంగ్రెస్ స్పష్టమైన అభిప్రాయంతో ఉందన్నారు. కుల గణన మాత్రమే కాకుండా.. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితికి సంబంధించి వివరణాత్మక సమాచారం సేకరించాలన్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనలో 56 ప్రశ్నలు అడిగారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే వ్యక్తికి 16వ జనాభా లెక్కల్లో 56 ప్రశ్నలు అడిగేంత అవగాహన.. ధైర్యం ఉందా? అనేది ప్రశ్నని అన్నారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో కొత్తగా ఏముందని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 2027 మార్చిలో జనాభా లెక్కలు జరుగుతాయని అందులో ఉందనీ, జనాభా లెక్కల గురించి మాత్రమే ఉందని అన్నారు. కులం గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అందులో అసలు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? అది కేవలం లెక్కింపు అవుతుందా? లేదంటే సామాజిక, ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు ఉంటాయా? అన్నదానిపై సమాచారం లేదన్నారు. ముఖ్యాంశాల్లో నిలిచేందుకే నోటిఫికేషన్ జారీ చేశారని, కుల గణనలో తెలంగాణ మోడల్ను జాతీయ స్థాయిలో అనుసరిం చాలని ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. అయితే ఇంతవరకూ పట్టించుకోని మోడీ సర్కార్ బీహార్తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్న విమర్శలూ లేకపోలేదు.
జనగణనకు గెజిట్ నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -