Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంజీడీపీ తిరోగమనం..

జీడీపీ తిరోగమనం..

- Advertisement -

– నాలుగేండ్ల కనిష్టానికి పతనం
– 2024-25లో 6.5 శాతమే
– తయారీరంగం వెలవెల : గణాంకాలను వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ :
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందన్న బీజేపీ సర్కార్‌ అర్బాట ప్రచారాలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. భారత వృద్ధిలో మరోమారు తిరోగమనం చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ ఏకంగా 6.5 శాతానికి క్షీణించి.. నాలుగేండ్ల కనిష్ట స్థాయికి దిగజారడమే ఇందుకు నిదర్శనం. కరోనా తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇంతక్రితం ఏడాది 2023-24లో నమోదైన 9.2 శాతం వృద్ధితో పోలిస్తే అమాంతం పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి. వ్యవసాయ రంగం రాణించగా.. తయారీ రంగం డిమాండ్‌ లేక మందగించింది. దీంతో మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యం నీరుగారినట్లయ్యింది.
కేంద్ర గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ప్రకటించిన రిపోర్ట్‌ ప్రకారం.. స్థిర ధరల వద్ద 2024-25లో వాస్తవ జీడీపీ రూ.187.97 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం 2023-24లోని రూ.176.51 లక్షల కోట్లతో పోల్చితే 6.5 శాతం పెరిగింది. 2024-2025 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జీడీపీ 7.4 శాతం పెరిగి కొంత ఆశాజనకంగా కనబడినప్పటికీ.. గతేడాది ఇదే త్రైమాసికంలోని 8.4 శాతం వృద్ధితో పోల్చితే.. క్రితం క్యూ4లో జీడీపీ మందగించింది.
వ్యవ’సాయం’..
జీడీపీ ఆ మాత్రం పెరుగుదలలోనూ వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషించింది. 2023-24లో ఈ రంగం 2.7 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. గడిచిన 2024-25లో 4.6 శాతం పెరిగింది. ఇదే సమయంలో గనుల రంగం 2.7 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం ఏడాది గనుల రంగం 3.2 శాతం పెరిగింది. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 8.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023-24లో 8.8 శాతంగా చోటు చేసుకుంది.
నిర్మాణ రంగం మందగింపు..
ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన తయారీ రంగం నేల చూపులు చూసింది. 2023-24లో ఈ రంగం ఏకంగా 12.3 శాతం వృద్ధి చెందగా.. గడిచిన 2024-25లో భారీగా 4.5 శాతానికి క్షీణించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలోని డిమాండ్‌, ప్రజల కొనుగోలు శక్తి పతనాన్ని ప్రతిబింబిస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ రంగం, గ్యాస్‌, నీటి సరఫరా 5.9 శాతానికి పడిపోయింది. ఈ రంగం ఇంతక్రితం ఏడాది 8.6 శాతం పెరిగింది. నిర్మాణ రంగమూ మందగించింది. ఈ రంగం 2023-24లో 10.4 శాతం పెరగ్గా.. గడిచిన ఏడాదిలో 9.4 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణ, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాల వృద్ధి 7.5 శాతంగా ఉండగా.. గడిచిన 2024-25లో 6.1 శాతానికి నెమ్మదించింది. ఫైనాన్సియల్‌, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌ 7.2 శాతానికి పరిమితమయ్యింది. ఈ రంగం 2023-24లో 10.3 శాతం పెరిగింది. వృద్ధి రేటు పడిపోవడమంటే దేశంలో నిరుద్యోగం పెరుగుదల, పెట్టుబడుల్లో స్తబ్దత, ప్రజల ఆదాయాలు పడిపోవడానికి నిదర్శనమని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గతేడాది 6.5 శాతం వృద్ధి రేటు కూడా కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు మెజారిటీగా చెందిందే తప్పా.. సగటు కార్మికులు, ప్రజల బ్రతుకుల్లో ఏ మాత్రం పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -