Monday, June 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅతి అంచనాలతో జీడీపీ జిమ్మిక్కు

అతి అంచనాలతో జీడీపీ జిమ్మిక్కు

- Advertisement -

4వ స్థానం అబద్ధం
జపాన్‌-ఇండియాకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం
ఎస్వీకే వెబినార్‌లో జేఎన్‌యూ ఆర్ధికశాస్త్ర పూర్వ అధ్యాపకులు ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

అతి అంచనాలతో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని గణించి, భారత ఆర్థికవ్యవస్థ పురోగతిలో ఉందని మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటున్నదని జేఎన్‌యూ ఆర్ధికశాస్త్ర పూర్వ అధ్యాపకులు ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో ‘ఇండియా జపాన్‌ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందా?’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. జీడీపీ లెక్కింపు ప్రక్రియలో జపాన్‌ అనుసరిస్తున్న విధానాలకు, భారతదేశ గణనకు అనేక అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వివరించారు. ఏమాత్రం విశ్వసనీయత లేని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్‌) లెక్కలపై ఆధారపడి, భారతదేశం జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నదని పాలకవర్గం చెప్తున్నదనీ, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని విశ్లేషించారు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలకవర్గం ఈ తరహా ప్రచారాన్ని ముమ్మరం చేసిందన్నారు. 2008లో ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం ఏమీ లేదనీ, వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్‌ చెప్పిందనీ, కానీ ఆ ఏడాది ఆ అంచనాలకు పూర్తి భిన్నంగా జరిగిందని గుర్తుచేశారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే లెక్కల్ని బట్టే ఐఎమ్‌ఎఫ్‌ ఆర్థిక స్థితిగతుల్ని లెక్కిస్తుందే తప్ప, సొంతంగా ఆయా శాఖల నుంచి గణాంకాలను తెప్పించుకొనే వ్యవస్థే వారికి లేదని స్పష్టం చేశారు. జీడీపీలో జపాన్‌ను దాటిపోతున్నామని ప్రచారం చేస్తున్నారనీ, వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి అంచనాలు 2027లో వస్తాయని విశ్లేషించారు. భారతదేశంలో బడ్జెట్ల రూపకల్పనలో ముందస్తు, రెండో ముందస్తు, ప్రొవిజినల్‌, రివైజ్డ్‌, ఫైనల్‌ అంచనాలు అనే ఐదు వ్యవస్థలు ఉంటాయని గుర్తుచేశారు. కేవలం ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఈ తరహా చర్చను మోడీ సర్కార్‌ తెరపైకి తెస్తున్నదని చెప్పారు. 2016-17లో జీడీపీ 8 శాతం ఉంటుందని అంచనా వేశారనీ, అదే ఏడాది నోట్ల రద్దు తర్వాత జీడీపీ 3 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆ తర్వాత జీఎస్టీ ప్రవేశం, కోవిడ్‌ లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలతో ఏనాడూ ప్రభుత్వ అంచనాలు వృద్ధిరేటును చేరుకోలేదని వివరించారు. జపాన్‌ జనాభా, వారి తలసరి ఆదాయం, భారతదేశ జనాభా, వారి తలసరి ఆదాయాల్లో భారీ వ్యత్యాసాలు ఉంటాయన్నారు. భారతదేశంలో వ్యవసాయరంగం అతిపెద్ద అసంఘటిత రంగం అనీ, ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గాలనేది ఎకనామిక్స్‌ మూల సూత్రమనీ, మరి ఎందుకు ద్రవ్యోల్బణం పెరుగుతుందో పాలకవర్గ మేథావులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్థికాభివృద్ధి అంచనాల రూపకల్పనలో 0.7 శాతం తేడాను ఆర్థికవేత్తలు అంగీకరిస్తారనీ, కానీ గడచిన పదేండ్లలో భారతదేశంలో ఈ వ్యత్యాసం 2.7 శాతంగా ఉన్నదని వివరించారు. జపాన్‌ను మించి జీడీపీ వృద్ధి చెందితే, భారతదేశ ప్రజలు జపాన్‌కంటే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవించాలనీ, కానీ దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శ్రమశక్తికి సంబంధించిన విధాన రూపకల్పనలోనే లోపాలు ఉన్నాయనీ, సంపద కొందరి చేతుల్లోనే నిలిచిపోయేలా ఆర్థిక విధానాలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై ఆర్థిక ఆంక్షలు పెరుగుతున్నాయనీ, వారి బ్యాంకు ఖాతాల్లోంచి నగదు ఉపసంహరణపై కూడా నెలకు మూడుసార్లకు మించి తీయకూడదనే షరతులు పెడుతున్నారని చెప్పారు. ప్రజల పొదుపు శక్తి సన్నగిల్లుతున్నదనీ, అసమంజస గణాంకాలు సేకరించి, అంతా బాగుందంటూ మన భుజాల్ని మనం తడుముకోవడం వల్ల ప్రయోజనాలు లేవని తేల్చిచెప్పారు. ఏటా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లలో ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ గణాంకాలకు మధ్య 4శాతం తక్కువ వ్యత్యాసం ఉంటుందని ఉదహరించారు. పెట్టుబడి-వినిమయం ఆధారంగా ఆర్థిక అంచనాలు పున్ణమూల్యాంకనం చేయాలని సూచించారు. వెబినార్‌కు ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. సీనియర్‌ జర్నలిస్టు కొండూరు వీరయ్య తెలుగు అనువాదం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -