– ఆరు ఎకరాల్లో చెట్లు తొలగింపు
– ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వైఎస్ బంజరలో ఘటన
నవతెలంగాణ – వేంసూరు
జన్యుపర లోపంతో నాలుగేండ్లైయినా పామాయిల్ చెట్లకు గెలలు రాక నష్టపోయిన ఓ రైతు తన ఆరు ఎకరాల్లోని చెట్లను జేసీబీతో తొలగించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వైఎస్ బంజరలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధిత రైతు చక్రధర్రెడ్డి మాట్లాడుతూ… నాలుగేండ్ల క్రితం ఆరెకరాల్లో పామాయిల్ మొక్కలు సాగు చేయగా, కొన్ని రోజులకే అవి నకిలీవని తేలినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లగా.. వారు వచ్చి పరిశీలించి జన్యుపర లోపమని చెప్పి వెళ్లిపోయారనీ, రోజులు గడుస్తున్నా ఆయిల్ఫెడ్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 80 శాతం పామాయిల్ చెట్లకు గెలలు రాలేదని తెలిపాడు. 2020 సంవత్సరంలో మూడో క్వాలిటీ సీడ్ను దిగుమతి చేసుకోవటం, నర్సరీల్లో పెంచిన మొక్కలు 60 శాతం వరకు నాణ్యత లేనివని, గతంలో అధికారులు ఆఫ్ టైప్ మొక్కలను కల్లింగ్ చేయకుండా రైతులకు ఇవ్వటం వల్లే ఇలా జరిగిందని ఆరోపించాడు. ఏండ్ల తరబడి ఆయిల్ ఫెడ్ అధికారులు, శాస్త్రవేత్తల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ఎంత కాలం ఎదురు చూడాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు ఒక పక్క కాపు రప్పిస్తామని చెప్పటమే కానీ అందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయాడు. రోజు రోజుకు పెట్టుబడులు అధికమవుతున్నాయని, ఆర్థికంగా తనకు భారంగా మారిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పామాయిల్ చెట్లను జేసీబీతో తొలగించాల్సి వచ్చిందని, దాంతో తాను తీవ్రంగా నష్టపోయినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
జన్యుపర లోపం.. పామాయిల్ రైతుకు అపార నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES