బోర్డు తిప్పేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్
రూ.20 వేలు చెల్లించుకున్న 300కు పైగా బాధితులు
కార్యాలయానికి తాళం, ఫోన్ లు స్విచ్చాఫ్
ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకోని డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. మోసపోయమని గమనించిన బాధితులు కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కార్యాలయం మూసి ఉండటంతో తమకు న్యాయం కావాలని కోరారు.
వివరాల్లోకి వెళ్లితే… ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఇటీవల డిజిటల్ మెక్రో ఫైనాన్స్ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపాడు. అయితే డ్రెస్ కోడ్ కోసం రూ.20 వేలు ఇవ్వాల్సి ఉంటుందని, అది వేతనంలో జమ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇది నమ్మిన దాదాపు 300పైగా మంది 20 వేల చొప్పున అందించారు. అయితే మొదటి నెల వేతనం రాకపోయే సరికి వారు నిలదీశారు. మంగళవారం సాయంత్రం డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా బుధవారం వచ్చి చూస్తే కార్యాలయానికి తాళం వేసి ఉంది. సంబంధిత వ్యక్తుల ఫోన్లు స్వీచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో మోసపోయమని బాధితులు గమనించి తమకు న్యాయం చేయాలని కార్యాలయం ఎదుట బుధవారం బైటాయించారు.
రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని వాపోయారు. ఆదిలాబాద్ తో పాటు ఉట్నూర్, జైనూర్ లో మొత్తం మూడు బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు. కాగా ఇటీవల రిమ్స్ కు ఒక కోటి రూపాయలతో పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటన కూడా చేశాడు.
సామాజిక సేవా పేరిట మోసం
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ… మైక్రో ఫైనాన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారన్నారు. అది నమ్మి మోసం జరగదనే ధీమాతో ఉద్యోగం కోసం డబ్బులు కట్టామని అన్నారు. కృష్ణ అనే వ్యక్తి వెడ్మ ఫౌండేషన్ పేరిట సామాజిక సేవా కొనసాగిస్తున్నారని తెలిసిందన్నారు. అదే నమ్మకంతో తాము డ్రెస్ కోడ్ కోసం రూ.20 వేలను చెల్లించడం జరిగిందన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. అలాగే 20 వేల కంటే ఎక్కువ ఇస్తే మంచి పొజిషన్ ఉన్న జాబ్ ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అలా కొందరు 20 వేలు, 25, 30 మరికొందరు 40వేలను కూడా చెల్లించరని వాపోయారు. వెంటనే తమ డబ్బులు తమకు ఇప్పించాలని ఆందోళన వ్యక్తంచేశారు.