Thursday, May 29, 2025
Homeజాతీయంపర్యావరణ అనుమతులివ్వండి

పర్యావరణ అనుమతులివ్వండి

- Advertisement -

– పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీంపై కేంద్రాన్ని కోరిన రాష్ట్రమంత్రి పొన్నం
– కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌తో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను ఆయన ఆఫీసులో కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలో పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌ అంశాలు, పర్యావరణ అనుమతులు, అటవీ భూములకు అనుమతులు, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో సీఎం రేవంత్‌, మరో మంత్రితో కలిసి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే… తాజాగా మహారాష్ట్ర లోని పూణేకు సంబంధించిన ఫారెస్ట్‌ ల్యాండ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అనుమతులకు అడ్డుగా మారాయి. ముఖ్యంగా, రెవెన్యూశాఖ నియంత్రణలో ఉన్న అటవీ భూములను గుర్తించాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ అంశంపైనా కేంద్రమంత్రితో పొన్నం చర్చించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గతంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను కేంద్రం తిరిగి పంపింది. అయితే ఆ డీపీఆర్‌ను తాజాగా సరి చేసి కేంద్ర అనుమతికి పంపిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు. ఆ డీపీఆర్‌ను పరిశీలించి ప్రాజెక్టుకు క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరారు. అలాగే, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని విన్నవించారు. అటవీ, పర్యావరణ అనుమతులు రాక వందకు పైగా ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి పొన్నం తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -