– శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు
నవతెలంగాణ – మిరుదొడ్డి
అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పే విధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించామని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు అన్నారు. 400 ఏండ్లు క్రితం వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చివరి రోజున మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు చండీ హోమం నిర్వహించారు.
చండి హోమంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.