– 10 గ్రాములు రూ.1.06 లక్షలకు చేరిక
ముంబయి : భారత మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.1,06,000 ఎగువన నమోదయ్యింది. అమెరికా అధిక టారిఫ్లకు తోడు డాలర్తో రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనం కావడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.1,06,070కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,05,200గా నమోదయ్యింది. గడిచిన ఏడు సెషన్లలో ఈ లోహం ధర ఏకంగా రూ.5,900 ఎగిసింది. 2024 డిసెంబర్ 31న రూ.78,950 వద్ద నమోదయిన బంగారం.. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూ.34.35 శాతం పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.1,26,100కి చేరింది. గడిచిన మూడు సెషన్లలో కిలో వెండిపై రూ.7,100 పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ లోహం ధర ఏకంగా 40.58 శాతం ఎగిసింది. 2024 డిసెంబర్ ముగింపు నాటికి 89,700గా పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క ఔన్స్ పసిడి ధర 3,477.41 డాలర్లకు చేరింది. అమెరికా టారిఫ్ల అనిశ్చితి, ఫెడ్ స్వతంత్రతపై ఆందోళనలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక ఆందోళనలు బంగారు ధరలను పెంచాలని నిపుణులు భావిస్తున్నారు.
నింగినంటిన బంగారం ధరలు
- Advertisement -
- Advertisement -