Thursday, May 22, 2025
Homeఅంతర్జాతీయందేశ రక్షణకు గోల్డెన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ

దేశ రక్షణకు గోల్డెన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ

- Advertisement -

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన
– 175 బిలియన్ల డాలర్ల ప్రాజెక్టుకు ఇజ్రాయిల్‌ స్ఫూర్తి

వాషింగ్టన్‌ : అమెరికాను దాడుల నుంచి కాపాడేందుకు 175 బిలియన్ల డాలర్ల వ్యయంతో గోల్డెన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకోసం ఒక డిజైన్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. దేశానికి ఎదురయ్యే ముప్పులను నివారించేందుకు బృహత్తరమైన రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఈ ప్రయత్నాలకు అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ గిట్లెన్‌ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆయన లీడ్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా వుంటారన్నారు. ఓవల్‌ ఆఫీసులో కూర్చుని ట్రంప్‌, దేశ రక్షణకు సంబంధించిన ఈ ప్రాజెక్టు వివరాలను పంచుకున్నారు. కెనడా కూడా ఇందులో భాగం కావాలనుకుంటోందని చెప్పారు.
అమెరికాపైకి దూసుకువచ్చే క్షిపణులను కనుగొని, వాటి మార్గాన్ని గుర్తించి, విజయవంతంగా అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఈ గోల్డెన్‌ డోమ్‌ ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. క్షిపణులను గుర్తించి, ట్రాకింగ్‌ చేయడానికి వందలాది ఉపగ్రహాలను ఈ రక్షణ కవచం మోహరిస్తుంది. జనవరిలోనే ట్రంప్‌ దీనికోసం ఆదేశించారు. అమల్లోకి వచ్చేసరికి సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ కార్యక్రమం రాజకీయ పరిశీలనను ఎదుర్కొంటోంది, మరోవైపు నిధుల లభ్యతపై అనిశ్చితి నెలకొంది. నిధుల సేకరణ పట్ల డెమొక్రటిక్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఈ ప్రాజెక్టులో ఎలాన్‌ మస్క్‌కి చెందిన స్పేస్‌ ఎక్స్‌ ప్రమేయంపై కూడా అసమ్మతి వ్యక్తమవుతోంది. ఇజ్రాయిల్‌కి గల ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థతో స్ఫూర్తి చెందిన ట్రంప్‌ మరింత విస్తృతితో ఈ గోల్డెన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ ఆలోచన చేశారు.
రష్యాపై ఈయూ, బ్రిటన్‌ కొత్త ఆంక్షలు తలొగ్గేది లేదన్న రష్యా
రష్యాపై యురోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌ కొత్త ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు పుతిన్‌ నుంచి హామీని పొందడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమైన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. రష్యా చమురు ట్యాంకర్ల దళాన్ని, ఆర్థిక కంపెనీల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించినట్లు ఇయు, బ్రిటన్‌ తెలిపాయి. అమెరికా తమతో చేతులు కలుపుతుందా లేదా అనేదానితో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి కృతజ్ఞతలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. తదుపరి విధించాల్సిన ఆంక్షలను రూపొందిస్తున్నట్లు యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ చెప్పారు. తమతో కలిసి రష్యాపై ఆంక్షలు విధించాలని యురోపియన్‌ దేశాలు పట్టుబడు తుండగా, అమెరికా వ్యతిరేకిస్తోంది. బ్రస్సెల్స్‌లో ఈయూ ప్రతినిధులతో కలిసి జర్మనీ విదేశాంగ మంత్రి జోనమ్‌ వాదెఫల్‌ మాట్లాడుతూ, ముందస్తు షరతులు లేకుండా రష్యా కాల్పుల విరమణ ప్రకటిస్తుందని ఆశించామని, అలా చేయనందున తాము స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. ెదిరేది లేదుాంటి అల్టిమేటమ్‌లకు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరొవా తెలిపారు. భవిష్యత్తులో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అనుగుణంగా మెమోరాండాన్ని సిద్ధం చేయడంపై ఉక్రెయిన్‌తో కలిసి పనిచేస్తామని పుతిన్‌ చెప్పారని, అందుకు కీవ్‌ సిద్ధం కావాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -