నవతెలంగాణ – ఆలేరు రూరల్
గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 8లోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన భూమిలేని పేదలకు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ భూముల విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భూ పోరాటం చేపట్టింది. ఈ కార్యక్రమం సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి పున్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. కొలనుపాకలో అనేక మంది పేదలు అద్దె ఇళ్లలో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి స్థలాలు లేక తీవ్ర కష్టాల్లో ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ పేదలకు ఇంటి స్థలాల పంపిణీ జరగలేదని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా భూమిలేని పేదలకు స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు.సర్వే నంబర్ 8లోని మూడు ఎకరాల భూమిపై సిపిఐ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎమ్మార్వో సహా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి స్పందించి భూమిలేని పేదలకు ఆ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అర్హులైన పేదలు సర్వే నంబర్ 8లో గుడిసెలు వేసి తమ హక్కు కోసం నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోతు ప్రవీణ్, బోతే భవాని, సంపత్, యాదమ్మ, యాదవ ఉపేందర్, బిక్షపతి, సంధ్య, సరళ, యాదమ్మ, నరసింహ, లక్ష్మి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



