– మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ -జడ్చర్ల
జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పీక్కుతినడం అత్యంత దారుణమైన ఘటన అని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాను ఆయన మంగళవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ దవాఖానాలో మార్చురీ గది నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రారంభానికి నోచుకోలేదన్నారు. మార్చరీని ప్రారంభిస్తే ఈ ఘటన జరిగేది కాదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జడ్చర్ల ఆస్పత్రి మార్చురీలో ఫ్రీజర్, సెక్యూరిటీ, కనీస సౌకర్యాలు కూడా లేవని, శవాలను కుక్కలు తినే దారుణ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్నా, సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల్లో ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖానాను 100శాతం బలోపేతం చేసి వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వానిది 90శాతం తప్పుంటే.. అధికారులు 10శాతం ఉందన్నారు. అధికారులను మాత్రమే బలిపశువులను చేయడం సబబు కాదన్నారు.
జడ్చర్ల ఆస్పత్రి ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



