Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి శీధర్ బాబు

ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి శీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి, సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం 600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలకు కావలసిన అవసరాలు గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు, పుస్తకాలు, అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు మొట్టమొదటి సారిగా కాటారం మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో  హైదరాబాద్, ఢిల్లీ లాంటి  నగరాలకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు విద్యను అభ్యసించాలని స్పష్టం చేశారు.  ప్రతి ఒక్క విద్యార్ధి  ఇంగ్లీషులో  మాట్లాడాలని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా, మండల స్థాయి విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను  పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, అవసరాలు గురించి తెలుసుకొని నివేదికలు అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అధునాతంగా తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆదేశించారు. కాటారాం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ పునర్నిర్మాణం, సైన్స్ ల్యాబ్ కెమికల్స్ ను అందిస్తామని అన్నారు. లైబ్రరీ లో పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్ లను సమకురుస్తామని మంత్రి తెలిపారు. హై స్కూల్ లలో కూడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడానికి విద్యాశాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -