Friday, June 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

- Advertisement -

కార్మిక సంఘాలతో చర్చించాలి
ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మహాసభలో చర్చ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్‌.రావు
ఫెడరేషన్‌ రాష్ట్ర 4వ మహాసభ లోగో, పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఆర్టీసీ కార్మికుల సమస్యలుపై ప్రభుత్వం స్పందించాలని, కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తేసి వారితో చర్చించి పరిష్కరించాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి విఎస్‌.రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీజీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర 4వ మహాసభ ఈనెల 21, 22వ తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగనున్న సందర్భంగా లోగో, పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌ గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, ఎస్‌డబ్య్లూఎఫ్‌ ప్రచార కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఎస్‌.రావు మాట్లాడుతూ.. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నిబంధనావళి ప్రకారం ప్రతి రెండేండ్లకొకసారి మహాసభ జరుగుతుందని, ఈ మధ్య కాలంలో ఆర్టీసీ పరిస్థితి, కార్మికుల పరిస్థితి, చేసిన ఆందోళనలు, వచ్చిన అనుభవాలను సమీక్ష చేసుకొని, రాబోయే రెండేండ్లకు కర్తవ్యాలు రూపొందించుకొంటామన్నారు. ఈ సమీక్ష కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా అవి పాటించే విధానాలలో మార్పు లేదని, వాటన్నింటిని ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల మధ్య సంపూర్ణ ఐక్యత సాధించడం వైపు ఉన్న ఆటంకాలు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ చేస్తున్న కృషిని గురించి మహాసభ చర్చించబోతున్నదన్నారు. సంస్థ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణకు కొనసాగించాల్సిన కృషి, జులై 9న జరుగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం, మహిళలు, రిటైర్డ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా మహాసభ చర్చించనున్నదని తెలిపారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఏర్పాటు తర్వాత ప్రధమ మహాసభకు (1982 నవంబర్‌) ఖమ్మం అతిథ్యం ఇవ్వగా.. 43 ఏండ్ల తర్వాత మళ్లీ ఇస్తుందన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ 4వ మహాసభకు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఆర్టీసీ కార్మిక నాయకులు అర్ముగ నయనార్‌, వర్కింగ్‌ ఉమెన్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కన్వినర్‌ ఎస్వీ రమ, తెలంగాణ పబ్లిక్‌ అండ్‌ ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌, ఏపీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.సుందరయ్య, పి.అయ్యపురెడ్డి హాజరవుతున్నారని ఆయన తెలిపారు. జులై 21న ఉదయం 10.30 గంటలకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు పతాకావిష్కరణ చేయడంతో మహాసభ ప్రారంభమవుతుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వేంకటేశ్వరరావు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజియన్‌ కార్యదర్శి పిట్టల సుధాకర్‌ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఖమ్మం డిపో కార్యదర్శి రోషయ్య కోశాధికారిగా, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఉప ప్రధాన కార్యదర్శి జి.లింగమూర్తి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఉపాధ్యక్షులు ఏ.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి జె.పద్మావతి, రీజియన్‌ అధ్యక్షులు గుండు మాధవరావు చీఫ్‌ పాట్రన్స్‌గా మొత్తం 60 మందితో ఆహ్వాన సంఘం ఏర్పడి మహాసభ ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -