శ్రీ సోమేశ్వర్ రైతు సంఘానికి ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యేకు వినతి..
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గల శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట నివాసంలో రైతు సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ బైరి రమేష్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం స్వచ్ఛందంగా ఏర్పాటైన శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం గ్రామ రైతులతో పాటు పక్క గ్రామాల రైతులకు కూడా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు, పశువులకు అవసరమైన దాణను సరసమైన ధరలకు అందిస్తూ సేవలందిస్తోంది అని ఎమ్మెల్యేకు వివరించారు.
రైతు సంఘం భవనాన్ని నిర్మించుకున్నప్పటికీ, మరికొన్ని సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ నిధులతో పది లక్షలతో పాటు, ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. ఈ వినతికి సంబంధించి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతుల కోరిక మేరకు నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి చీరబోయిన మల్లేశం, కోశాధికారి గాదె సోమిరెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



