సర్పంచ్ గోదా శ్రీశైలం యాదవ్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీల బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అంగన్వాడి సెంటర్లకు వచ్చే పేద పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సర్పంచ్ గోదా శ్రీశైలం యాదవ్ చెప్పారు. శనివారం మండలంలోని మసి గుండ్లపల్లి గ్రామంలో పౌష్టిక ఆహారం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ..గ్రామంలో నిరుపేద పిల్లలు పౌష్టికాహారం అందక ఎంతో మంది బలహీనంగా ఉంటున్నారని తెలిపారు.
ప్రభుత్వము గర్భవతులకు, బాలింతలకు, పిల్లల, ఆరోగ్యం కోసం అంగన్వాడి సెంటర్ల ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా అంగన్వాడి సెంటర్లకు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ నుండి వస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భం దాల్చినప్పటినుండే తల్లులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే లక్ష్యంతోనే ప్రభుత్వం పోషకాహారాలను పేదలకు అందిస్తుందని చెప్పారు.
అనంతరం గర్భధారణ మహిళలకు, చిన్న పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పోషకార పదార్థాలను ఉప సర్పంచ్ జనార్దన్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాణి, ఏఎన్ఎం నీలమ్మ, వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది , ఆశా వర్కర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



