– రిజర్వేషన్ కేటాయింపులకు జనాభా లెక్కలు కీలకం
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక పాలక వర్గాల ఎన్నికల్లో ఆధిపత్యం సాధించిన అధికార పార్టీ జోష్ లో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పురపాలక సంఘాల (మున్సిపాల్టీ) ఎన్నికలు నిర్వహించి, ఆపై మండల – జిల్లా పరిషత్ ఎన్నికల దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియకు అనుగుణంగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.
ఈ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా, వార్డుల వారీగా ఎస్సీ,ఎస్టీ జనాభా వివరాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. రిజర్వేషన్ కేటాయింపులే ఈ ఎన్నికల రాజకీయ సమీకరణలకు కీలకంగా మారనున్నాయి.ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాల్టీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడంతో, యంత్రాంగం వేగం పెంచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కీలక గణాంకాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో మొత్తం 129 వార్డులు ఉన్నాయి.
మొత్తం జనాభా: 2,56,734
ఎస్టీ జనాభా: 40,276
ఎస్సీ జనాభా: 44,773
ఎస్టీ + ఎస్సీ మొత్తం: 85,049 మంది.
మున్సిపాల్టీ వారీగా వివరాలు
మున్సిపాల్టీ వార్డులు జనాభా ఎస్టీ, ఎస్సీ
కొత్తగూడెం 60 1,70,897 30,904 33,287
ఇల్లందు 24 33,732 2,574 6,894
మణుగూరు 23 32,065 4,341 4,282
అశ్వారావుపేట 22 20,040 2,457 3,310
రాజకీయ ప్రాధాన్యం :
ఎస్సీ,ఎస్టీ జనాభా శాతం ఆధారంగా వార్డు రిజర్వేషన్లు నిర్ణయించ నుండటంతో, అభ్యర్థుల ఎంపికలో పార్టీల వ్యూహాలు మారే అవకాశం ఉంది. పట్టణ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం,ఇల్లందు మున్సిపాల్టీల్లో రిజర్వేషన్ ప్రభావం ఫలితాలను తారుమారు చేసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి, జనాభా గణాంకాలే మున్సిపాల్టీ ఎన్నికల రాజకీయ చిత్రాన్ని నిర్ణయించనున్న నేపథ్యంలో, అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.



