నవతెలంగాణ – వనపర్తి
రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే తేమ శాతం వివరాలు రిజిస్టర్లలో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి రైతు వేదికలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే తేమ శాతం వివరాలు రిజిస్టర్లలో తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎఫ్ ఏ క్యూ ప్రమాణాల ప్రకారం ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించేలా కొనుగోలు కేంద్రం ఇంచార్జిలు అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించడం నేర్చుకున్న వారికి మాత్రమే కేంద్రాలను కేటాయించాలని, శిక్షణ పై ఆసక్తి లేని వారికి కొనుగోలు కేంద్రాలను కేటాయించవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తాలూ తరుగు లేకుండా రైతులకు సూచనలు చేయాలని, తాలు ఏమైనా ఉంటే క్లీనింగ్ యంత్రాల ద్వారా తొలగించాలని తెలియజేయాలన్నారు. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ట్రైనింగ్ తీసుకున్న ఇంచార్జి లు, ఆపరేటర్ లు మాత్రమే సెంటర్ లలో కనిపించాలని, వేరే వ్యక్తులు ఉండడానికి వీళ్లేదని ఆదేశించారు. హార్వెస్టర్లతో మాట్లాడి పంటలో గింజ పక్వానికి వచ్చినపుడే కోతలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హార్వెస్టర్లు పంట కోసేటప్పుడు బ్లోయర్ ఆక్టివ్ మోడ్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయధికారి ఆంజనేయులు గౌడ్, సివిల్ సప్లై అధికారి, కాశీ విశ్వనాధ్, డీసీ ఓ రాణి, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తేమ వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES