నవతెలంగాణ – నసురుల్లాబాద్
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి ధాన్యం బస్తాలను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షం రైతులకు ఇబ్బందులు పడడంతో మంగళవారం బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామాల్లో పోచారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఉదయం ఎండలు రాత్రి వానలు కురియడంతో ధాన్యం తడిసిపోతుందని, ధాన్యం రాశులపై కప్పడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో దాన్యం కోసి 15 రోజులు అవుతున్న మ్యాచరు రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి పగలు అనే తేడా లేకుండా ధాన్యం రాశుల వద్దే కాపలా ఉండడం జరుగుతుందన్నారు. రైతుల నుండి వివరాలు తెలుసుకున్న ఆయన, డీఎస్ఓకు ఫోన్ ద్వారా తక్షణ సూచనలు చేశారు. లారీలు రాకపోయినా ఎదురు చూడకుండా, తూకం వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో నేరుగా రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు కూడా ఆలస్యం చేయకుండా, బస్తాలు చేరగానే వెంటనే దింపుకోవాలని సూచించారు. వర్షం ఇంకా రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆధారంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
తూకం వేసిన బస్తాలపై పాలిథీన్ ప్లాస్టిక్ కప్పుకోవాలి రాశులు తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు రైతులకు అండగా ఉండాలన్నారు.రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే అండగా నిలుస్తుంది. అవసరమైన సహాయం అందిస్తామన్నారు. వీరి వెంట వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.



