– దొడ్డు ధాన్యానికీ బోనస్ ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై ఎదురవుతున్న సమస్యలను పలువురు రైతులు ఏకరువు పెట్టారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు మార్కెట్లో నిరాదరణ ఎదురవుతుందన్నారు. ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ.. వెనువెంటనే ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దొడ్డు ధాన్యం పండించిన రైతులకు కూడా రూ.500 బోనస్ చెల్లించాలని కోరారు. మిల్లర్లు తరుగు పేర, తాలు పేరిట క్వింటాపై 8కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాపై 2కిలోలు మాత్రమే తరుగు తీయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వద్దకు రైతులు కిరాయి వాహనాల ద్వారా ధాన్యం చేరవేస్తున్నారని, ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లించడం లేదన్నారు. ధాన్యం డబ్బులు, ట్రాన్స్పోర్టు చార్జీలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో కల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులకు సరిపడా టార్పాలిన్లు అందించాలన్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో మంచినీళ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొరబొయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, ముంజాల సాయిలు, నాయకులు అక్కాపెల్లి సుధాకర్, గడ్డమీది బాలకష్ణ, కందికొండ రాజు, దాసరి నరేష్, నర్శింహారాములు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES