– డిఎస్ సిడిఓ, మండల ప్రత్యేక అధికారి రాజా గంగారాం
– టామ్ టామ్ ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణలో ఈనెల 2న నిర్వహించ తలపెట్టిన గ్రామసభలను ప్రకడ్బందీగా నిర్వహించాలని డిఎస్ సిడిఓ, మండల ప్రత్యేక అధికారి రాజా గంగారాం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమస్త మండల స్థాయి అధికారులు, సమస్త పంచాయతీ కార్యదర్శిలతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2న చేపట్టబోయే గ్రామసభలపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం మాట్లాడుతూ గ్రామ సభలో నిర్వహించే ప్రదేశాల్లో ప్రజలకు అవసరమైన నీడ, తాగునీరు వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచాలన్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7:30 నుండి 10:30 గంటలలోపే గ్రామసభలను నిర్వహించాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. గ్రామ సభలను పండుగ వాతావరణంలో నిర్వహించడంతోపాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసి గ్రామపంచాయతీలో ప్రదర్శించాలని సూచించారు. గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా గ్రామ సభలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామాల్లో ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను గ్రామ సభల సందర్భంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.
గ్రామసభల్లో ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.



