50వేల మందితో సీపీఐ(ఎం) పాదయాత్ర
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహారాష్ట్రలో ప్రజల డిమాండ్లు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదంటూ సీపీఐ(ఎం) నిరవధిక ఆందోళనకు దిగింది. మహారాష్ట్రలోని చరోటి నుంచి పాల్ఘర్ వరకు 50 వేల మందితో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సోమవారం పాల్ఘర్ జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి వచ్చిన ప్రజలతో దహను తాలూకాలోని చరోటి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రికి మనోర్లో బస చేసి, మంగళవారం పాల్ఘర్ జిల్లా కలెక్టరేట్ వైపు ముందుకు సాగనుంది.
ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నిర్దిష్ట కాలపరిమితితో లిఖితపూర్వకంగా అంగీకరించే వరకు ఈ ఆందోళన కొనసాగనున్నది. ఈ పాదయాత్రలో ఏఐకేఎస్, సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, తదితర ప్రజా సంఘాలూ పాల్గొన్నాయి. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అజిత్ నవాలే, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే వినోద్ నికోలే, తదితరులు ఈ యాత్రకు నాయకత్వం వహించారు. మంగళవారం ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ ఈ యాత్రలో చేరనున్నారు.
ప్రధాన డిమాండ్లు
అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. అన్ని దేవాలయ, ఇనామ్, ప్రభుత్వ భూములను సాగుదారుల పేరిట బదలాయించాలి. ఎంఎన్జీఆర్ఈఏను పునరుద్ధరించాలి. స్మార్ట్ మీటర్ పథకాన్ని రద్దు చేయాలి. పెసా చట్టాన్ని అమలు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. వధ్వాన్, ముర్బే ఓడరేవులను రద్దు చేయాలి. తాగునీరు, సాగునీటి సౌకర్యం కల్పించాలి. విద్య, ఉపాధి, రేషన్, ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన సౌకర్యాలను పెంచాలి.



