- – పాల్గోన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే..
- నవతెలంగాణ – జుక్కల్
- జుక్కల్ మండల కేంద్రంలో శ్రీ దుర్గ భవానీ మాత ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి మాత ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మాత ఆలయ ప్రాంగణం పూలతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడింది. “జై దుర్గమాత” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. స్థానిక యువత, మహిళా సంఘాలు, భక్తులు కలసి ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు వేదపండితుల నేతృత్వంలో మహాహోమాలు, శతచండీ యజ్ఞాలు, కుంకుమార్చన, నవరాత్రి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రతి రోజు భజన బృందాల గానాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, దీపారాధనలతో పవిత్ర వాతావరణం నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ “దుర్గమాత కృపతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నెలకొనాలని, ప్రజలు ఐక్యంగా అభివృద్ధి దిశగా సాగాలని” ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులు, యువత, మహిళా సంఘాలు, వేదపండితులను ఆయన అభినందించారు. ఈ మహోత్సవంలో సమీప ప్రాంతాల భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కలశాలతో ప్రదక్షిణలు చేసి మాతకు పూజలు సమర్పించారు. మహోత్సవం చివరి రోజు మహా పూర్ణాహుతి, దుర్గమాత కల్యాణం, అనంతరం అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని మాత ఆశీర్వాదాలు పొందారు. అన్నదానానికి స్థానికులు, వ్యాపారులు, సేవాభావులు సహకరించారు.మాత ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ, భక్తుల నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దుర్గమాత ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంగా, అభివృద్ధి దిశగా సాగాలని అందరూ ఆకాంక్షించారు.