రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కివచ్చినట్టే కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు దిశానిర్దేశం చేసింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ బుధవారం కీలక తీర్పును వెల్లడించింది.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. గడువు ముగిసినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా వాదోపవాదనలు జరుగుతున్నాయి. గతేడాది ప్రభుత్వం రెండు నెలల గడువు కోరింది. తాజాగా మళ్లీ సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో అభ్యంతరం తెలిపింది. పంచాయతీల్లో వార్డులను ఖరారు చేసి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనంతా కుంటుపడింది. జనం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వెలువడిన తీర్పు ప్రభుత్వ కాలాయాపనకు చెక్ పెట్టినట్టయింది.
రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలు గడవు పూర్తయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెబుతుండగా గెలిచిన ప్రభుత్వం ఏదైనా స్థానిక ఎన్నికల విషయంలో దానిన ఉల్లంఘిస్తూనే ఉంది. తెలంగాణ పంచాయతీ రాజ్ -2018 చట్టాన్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా తాను గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలకు వెళ్తున్నది! పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న సూక్తిని కూడా మరిచి రాజకీయలు చేస్తున్నది. అలాంటప్పుడు పంచాయతీల నిర్వహణ ఎలా సాధ్యమ వుతుంది? నిధుల్లేక నీరసించిపోతుంది.కేంద్రమైనా ఆదుకుంటుందా అంటే అదీ లేదు.2024 జనవరి 31తో సర్పంచ్ల పాలన ముగిసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తూ వస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పజెప్పింది. వారు ఇతర విధులు కూడా నిర్వహించడంతో క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు గ్రామాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు పవర్ లేకపోవడం జనానికి పెద్ద సమస్యగా పరిణమించింది. ఈనేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.
రాష్ట్రంలో 12,769 పైగా ఉన్న పంచాయతీల్లో ఎస్డీఎఫ్, సీడీఎఫ్, ఎస్ఎఫ్సీ పెండింగ్ బిల్లులు రూ.600 కోట్ల వరకు ఉండటం బాధాకరం. వీటి విడుదల కోసం ఏడాది కాలంగా మాజీ సర్పంచులు ఉద్యమిస్తున్నా సర్కార్ పట్టించు కోవడం లేదు. నెలవారీగా రావాల్సిన రూ. 300 కోట్ల నిధులు సైతం అందడం లేదు. ఈ నేపథ్యంలో పదేండ్ల కాలంగా చూస్తే 70కిపైగా సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడిన తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఇది వారి దుర్భర జీవనస్థితికి అద్దం పడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో 2.14 కోట్ల జనాభా ఉంది. అభివృద్ధి పనులకు ఆర్థిక సంఘం నుంచి నిధులిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చాలామంది సర్పంచులు సొంత డబ్బుల్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే వారికి బిల్లుల్ని మంజూరు చేయడంలో ఎనలేని ఆలస్యం జరుగుతున్నది. అలాగే ఆయా పథకాల ద్వారా పంచాయతీలకు రావాల్సిన కేంద్రం నిధులు సైతం ఆగిపోవడంతో పల్లెల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినా నెరవేర్చుకోలేదు. పాలకవర్గాలు ఆ బాధ్యతను విస్మరిస్తే ఎన్నికలు నిర్వహించే అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్నా అది సరైన చొరవ చూపడం లేదు. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో నెలరోజుల సమయం కావాలని హైకోర్టును సర్కారు కోరడం గమనార్హం. ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తే ఎన్నికల నిర్వహణకు తమకు రెండు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతున్నది.
బీసీ రిజర్వేషన్ల ఖరారుతోపాటు పోలింగ్ కేంద్రాలు, భద్రతా వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పింది.ఈనేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి.మూడు నెలల్లోపు నిర్వహించాలన్న న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ ముందుకు సాగాలి.
‘పంచాయతీ’కి పచ్చజెండా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES